గంభీర ప్రకటనలు బోల్తా.. అంతా ఆడేసుకుంటున్న వేళ... కేసీఆర్ మౌనం వెనుక కారణమిదేనా?
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కనిపించకుండా పోవడం సర్వత్రా ఆందోళనకు,విమర్శలకు తావిస్తోంది. కరోనా వైరస్ పరిస్థితిని హ్యాండిల్ చేయలేక చేతులేత్తేసిన కేసీఆర్... ఎవరికీ సమాధానం చెప్పుకోలేక ఫామ్ హౌస్లో దాక్కున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొందరేమో... కేసీఆర్కు కరోనా సోకినందువల్లే ఫామ్ హౌస్కు పరిమితమయ్యారన్న వాదన వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో whereisKCR అనే హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేసీఆర్కు ఏమైందో చెప్పాలని కొందరు... ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారా అని ఇంకొందరు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు కూడా 'కేసీఆర్కు కరోనా'పై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ప్రభుత్వం ఇప్పటికీ మేల్కొవట్లేదు... : కోదండరాం
తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ... నడిసముద్రంలో నావ వెళ్తుంటే కెప్టెన్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అలా ఉందన్నారు. ప్రజల్లో భీతావహ,ఆందోళనకర వాతావరణం నెలకొందన్నారు. ఇప్పటికీ తెలంగాణలో ఎక్కడ టెస్టులు చేస్తారు... ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారన్న స్పష్టమైన వివరాలు ప్రజలకు చేరట్లేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కనపడకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం పెంచుతుందన్నారు. నిజానికి ప్రభుత్వం ఒక దశ దాటాక టెస్టులు చేయడం కూడా మానేసిందని కోదండరాం అన్నారు. సూర్యాపేటలో కరోనా అనుమానిత మృతదేహాలకు అక్కడి వైద్యాధికారులు టెస్టులు చేస్తుంటే.. నోటీసులిచ్చి మరీ వాటిని రద్దు చేయించారని చెప్పారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని చెప్పడం... ప్రజల్లో భయాందోళనను తొలగించేందుకే అలాంటి ప్రకటనలు అని సమర్థించుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ మేల్కొంటున్నట్లు కనిపించట్లేదని పేర్కొన్నారు.
అందుకే చెప్పట్లేదేమో...? : రఘునందన్ రావు
బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడితే... ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తమతో ఈ విషయాన్ని చెప్పారన్నారు. కాలువకు గండి పడిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ బిల్డింగ్ పైనుంచి పరిశీలించాడని అక్కడి గ్రామస్తులు చెప్పినట్లుగా తెలిపారు.
ప్రగతి భవన్లో చాలామందికి కరోనా సోకిన వేళ... కేసీఆర్ కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దన్న ఉద్దేశంతో ఫామ్ హౌస్లో ఉండి ఉండవచ్చునని అన్నారు. లేదా కేసీఆర్కు కరోనా సోకిందని చెబితే... జనం మరింత భయాందోళనకు గురవుతారన్న ఉద్దేశంతో ఎలాంటి ప్రకటనలు చేయట్లేదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే బాధ్యతగల ముఖ్యమంత్రి వారానికి పైగా కనిపించకుండా పోతే... ప్రజల్లో సహజంగానే ఆందోళన నెలకొంటుందని... తమ ఆరోగ్యాలను పట్టించుకోకపోయినా... కనీసం సీఎం ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతారని అన్నారు. కాబట్టి దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అసత్య ప్రచారమైతే... చర్యలేవి... : అద్దంకి దయాకర్
కరోనా విజృంభిస్తున్నవేళ ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన కేసీఆర్ ఎక్కడ కనిపించకుండా పోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఓవైపు మెడికల్ సౌకర్యాలు సరిగా లేక,మరోవైపు కేసులు పెరుగుతుంటే... ముందుండి దిశా నిర్దేశం చేయాల్సిన వ్యక్తి కనిపించకుండా పోతే ప్రజలు ఆందోళన చెందుతారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాలకు కరోనా రావాలని కోరుకున్నట్లు తాము ఆయనకు కరోనా రావాలని కోరుకోవట్లేదన్నారు.
అయితే కేసీఆర్కు కరోనా సోకిందని ఇంత ప్రచారం జరుగుతున్న వేళ... స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అది అసత్య ప్రచారమైతే... ఆ వార్తను ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.
సీఎంవో స్పష్టతనివ్వాలి.. : ఎంపీ అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... సీఎం ఆరోగ్యంపై సీఎంవో కార్యాలయం స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు,శ్రేయోభిలాషులతో పాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొందన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సైతం కరోనా సోకిందని... ఆయనేమీ ఆ విషయాన్ని దాచిపెట్టలేదని గుర్తుచేశారు. కాబట్టి ఒకవేళ కరోనా సోకితే... ఉన్న విషయాన్ని బయటపెట్టేందుకు ఎందుకు సందేహిస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ లేకపోతే లేదని క్లారిటీ ఇవ్వాలన్నారు. అసలు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం పాలన సాగుతోందన్నారు. ఎక్కడా పేషెంట్లకు వెంటిలేటర్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని... మెడికల్ కాలేజీ సీటు కంటే వెంటిలేటర్ కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని అన్నారు.
గంభీర ప్రకటనలు బోల్తా...
అటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టులు పెంచుతున్నామని చెప్పడం.. ప్రశ్నించేవాళ్లను దబాయిస్తూ గంభీర ప్రకటనలు చేయడం తప్పితే... ప్రభుత్వం ఇప్పటికీ టెస్టుల సంఖ్యను పెంచట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 10లక్షలకు పైగా టెస్టులు చేస్తే... ఇప్పటివరకూ తెలంగాణలో మాత్రం కేవలం లక్ష పైచిలుకు టెస్టులు చేశారు. నిజానికి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన ప్రతీసారి... కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తో వాటిని పటాపంచలు చేయడం పరిపాటి. కానీ ఈసారి ఎందుకనో ఆయన ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ప్రభుత్వ వేర్ ఈజ్ కేసీఆర్ అని జనం ప్రశ్నిస్తూనే ఉన్నారు.