తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మెషీన్... ఆ రాష్ట్రానికి తరలించుకుపోయిన బీజేపీ...
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం,బీజేపీ పరస్పర ఆరోపణలు,విమర్శలు చేసుకుంటున్నాయి. వైరస్ నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సోమవారం ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా...ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా సంజయ్ ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిప్పికొట్టారు.

కేంద్రం చేసిందేమీ లేదు...,అవి చెప్పింది కేసీఆరే...
'గుజరాత్లో మీటింగ్ పెట్టింది మీరే... పీపీఈ కిట్లు ఇవ్వంది మీరే,వెంటిలేటర్లు సప్లై చేయనిది మీరే..' అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రూ.20లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించారు గానీ.. 30 కోట్ల మంది వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. అసలు దేశంలో మర్కజ్ గురించి మొదట కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే అని చెప్పారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్కు... అక్కడి ఇండోనేషియన్లు వచ్చిన విషయమే తెలియదన్నారు. కేంద్రానికి కంటైన్మెంట్ జోన్ల గురించి సూచించింది కూడా కేసీఆరే అని చెప్పారు. అప్పటివరకూ కేంద్రానికి ఆ సంగతే తెలియదన్నారు.

ప్రతిపక్ష నేత సైతం కేసీఆర్ను ప్రశంసించారని...
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రైతులు,వలస కార్మికులకు ఇచ్చిందేంటని ప్రశ్నించారు. 30 కోట్ల మంది వలస కార్మికుల ఉసురు తీసుకున్నారని విమర్శించారు.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి సంక్షోభ సమయంలోనూ రూ.5వేల పైచిలుకు కోట్లతో రైతు బంధు సాయం అందిస్తున్నారని చెప్పారు. కల్నల్ సంతోష్ బాబు సరిహద్దులో వీర మరణం పొందితే... ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయన్నారు. ఆఖరికి కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సైతం కేసీఆర్ను చూసి నేర్చుకోవాలంటూ పేర్కొన్నారు. 1960 నుంచి 2020 వరకూ ఎంతో మంది సైనికులు అమరులయ్యారని... కానీ కేసీఆర్ అందించిన స్థాయిలో ఎవరూ సాయం అందించలేదని చెప్పారు. అలాంటి వ్యక్తిపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదన్నారు.

నమస్తే ట్రంప్... నిలదీసిన జీవన్ రెడ్డి...
సింగపూర్లో లాక్ డౌన్పై 5 రోజుల ముందే ప్రకటన చేశారని జీవన్ రెడ్డి చెప్పారు. అలాగే సౌతాఫ్రికాలో వారం రోజుల ముందే దానిపై ప్రకటన చేశారన్నారు. కానీ భారత్లో మాత్రం.. నోట్ల రద్దు సమయంలో వచ్చినట్టే రాత్రి పూట 8గంటలకు టీవీలకు ముందుకు వచ్చి మోదీ అప్పటికప్పుడు లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ఆ తర్వాత చప్పట్లు కొట్టమన్నారు... దీపాలు వెలిగించమన్నారు తప్పితే... కోవిడ్ 19 నియంత్రణ కోసం చేసిందేమీ లేదన్నారు. ఓవైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాతో విలవిల్లాడుతుంటే.. ఫిబ్రవరి నెలలో గుజరాత్లో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించడమేంటని ప్రశ్నించారు.

ఎంపీ అరవింద్పై విమర్శలు...
నిజామాబాద్ ఎంపీ అరవింద్.. కరోనా సమయంలో కనీసం ఒక్కరికీ వాటర్ బాటిల్ సాయం చేసిన పాపాన పోలేదన్నారు. ఒక్కరినైనా ఆదుకున్నది లేదన్నారు. మాట్లాడితే.. టీఆర్ఎస్ నాయకులను ఆయన పింకీస్ అని విమర్శిస్తున్నాడని... మరి ఆయన తండ్రి తమ పార్టీ తరుపునే రాజ్యసభలో ఉన్నారు కదా అని గుర్తుచేశారు. మేము పింకీలం అయితే నువ్వు మంకీవా.. డాంకీవా అంటూ ఎద్దేవా చేశారు. కరోనా విషయంలో,జాతీయ భద్రత విషయంలో రాజకీయాలు వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు సూచించారని... ఆయన ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. ఇకనైనా బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
Recommended Video

ఆ మెషీన్ను బెంగాల్కు తరలించుకుపోయారు...
రాష్ట్రంలో టెస్టులు చేయట్లేదన్నది అవాస్తవమని... ఇప్పటివరకూ 60వేల టెస్టులు చేశామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మిషన్ను కోల్కతాకు తరలించారని ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయని కోల్కతాకు టెస్ట్ మిషన్ను తరలించారని జీవన్రెడ్డి ఆరోపించారు. ఆఖరికి బీజేపీ వాళ్లకు ఏ నినాదం ఇవ్వాలో అర్థం గాక.. రాష్ట్రంలో కరోనా కేసులు పెంచాలని నినదిస్తున్నారని చెప్పిన జీవన్ రెడ్డి... ఆ వీడియోను మీడియాకు చూపించారు. టెస్టుల సంఖ్యకు బదులు కరోనా కేసులు పెంచాలని బీజేపీ నేతలు నినదించడం అందులో కనిపించింది.












Click it and Unblock the Notifications