ఈమెక్కడ తహసిల్దారురా నాయనా..? డిక్కీ నిండా పాసు బుక్కులే..!!
Recommended Video
హైదరాబాద్ : తహసీల్దార్ లావణ్య అవినీతి దందా యధేచ్చగా సాగినట్టు ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ లావణ్యకు సంబంధించిన ప్రైవేటు కారులో తనిఖీలు నిర్వహించిన అధికారులు, ఎక్కువ సంఖ్యలో పట్టాదారు పాసు పుస్తకాల్ని గుర్తించారు. వీటిలో కొన్ని 2008 సంవత్సరానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అవి కారులో ఎందుకున్నాయి? వాటి ఆధారంగా ఏవైనా నగదు సంప్రదింపులు జరిగాయా? అడిగిన మొత్తం ఇవ్వకపోవడం వల్లే పాస్బుక్కులు వారికి ఇవ్వకుండా తహసీల్దార్ తన వద్దే పెట్టుకున్నారా? తదితర కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
పాస్ బుక్లతోపాటు పదుల సంఖ్యలో దరఖాస్తులను కూడా అధికారులు గుర్తించారు. అలాగే, ఆమె రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టారని నిర్ధారించుకున్నారు. వాటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా కొందుర్గు వీఆర్వో అనంతయ్యను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే.
వాటిలో 11 ఏళ్ల కిందటివి కూడా..! ఇవీ ఆమె దందాలో భాగమేనా..!?
లంచంలో 5 లక్షల రూపాయలు తహసీల్దారు వాటా అని ఆయన ఏసీబీ అధికారులకు స్పష్టం చేశారు. దాంతో, కేశంపేట తహసీల్దారు లావణ్యను విచారించిన ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో 93.50 లక్షల రూపాయల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు కూడా. అవినీతి నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్యపై కేసులు నమోదు చేసిన అధికారులు.. గురువారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వారిని హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాగా, తహసీల్దార్ లావణ్య బ్యాంకు ఖాతాలు, లాకర్లు, మరిన్ని ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. లావణ్యకు మూడు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలు సేకరణకు సిద్ధమవుతున్నారు.
అజ్ఞాతంలో భర్త..! వేట ముమ్మరం చేసిన పోలీసులు..!!
తహసీల్దార్ లావణ్య భర్త వెంకటేశం నాయక్ టీఎన్జీవోస్ యూనియన్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఏసీబీ దాడుల విషయం తెలిసినప్పటి నుంచీ వెంకటేశం అజ్ఞాతంలో ఉన్నారు. తనిఖీల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు వెంకటేశంకు ఫోన్ చేశారు. వస్తున్నా అని చెప్పిన వెంకటేశం ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేశం పోలీసులకు చిక్కితే మరింత అక్రమార్జన వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
అవినీతికి అడ్డాగా తహసీల్ కార్యాలయం..!కటాకటాల్లోకి లావణ్య, వీఆర్వో..!!
రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తహసీల్దార్ లావణ్య అవినీతికి అడ్డాగా మార్చారు. రెండున్నరేళ్లుగా ఇక్కడే పని చేస్తున్న ఆమె.. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించారు. సిబ్బందిని కూడా అవినీతికి ప్రోత్సహిస్తూ వచ్చారు. కేశంపేట రెవెన్యూ సిబ్బందితో కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని కేశంపేటకు చెందిన ఆకుల లలిత అనే మహిళా రైతు రెవెన్యూ కార్యాలయం ఎదుటే ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిందంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై సమగ్ర విచారణ జరిపితే మరింత అవినీతి బయటపడుతుందని అంటున్నారు.
ఐటీకి చిక్కొద్దని ఇంట్లోనే కరెన్సీ..! మిషన్లతో ఏసీబీ అధికార్ల కౌంటింగ్..!!
ప్రభుత్వ ఉద్యోగి.. నగదును బ్యాంకుల్లో జమ చేస్తే ఐటీ, ఏసీబీ నిఘా ఉంటుంది! భూములు కొనుగోలు చేసినా అంతే! అందుకే, రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య ఇంట్లోనే గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దాచారు. వాటిని దాచేందుకు వీలుగా తనకు వచ్చిన నగదును 2000, 500 నోట్లుగా మార్చుకున్నారు. ఆ నోట్ల కట్టలను బీరువాలు, కబోర్డులు.. ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే సర్దేశారు! ఏసీబీ అధికారుల సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏసీబీ అధికారులు కౌంటింగ్ మెషీన్ ఉపయోగించారు. గంటల తరబడి శ్రమించి మొత్తం విలువ లెక్కగట్టారు.