గేటెడ్ కమ్యూనిటీలో దంపతుల దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాద్ నార్సింగిలోని హైదర్షాకోట్ సాయిహర్ష కాలనీలో గురువారం సాయంత్రం వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వేదాల సింహాచలం (65), సులోచన (60) సాయిహర్ష కాలనీలో ఉంటున్నారు. సింహాచలం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మొయినాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సులోచన ఐదు నెలల క్రితం పదవీ విరమణ చేశారు.
వీరి ఇంటికి 500 మీటర్ల దూరంలో ప్రభుత్వ బోరు ఉంది. కొన్ని నెలలుగా ఇది పనిచేయకపోవడంతో మరమ్మతు చేయించడానికి కాలనీలోని ఇతర మహిళలతో కలిసి సులోచన గురువారం సాయంత్రం బయటకు వెళ్లారు. సింహాచలం ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి నేరుగా సింహాచలం ఇంట్లోకి వెళ్లారు. అతడి తలపై కర్రలతో కొట్టి కడుపులో కత్తితో పొడిచారు. తర్వాత కాసేపటికి సులోచన ఇంటికి వచ్చారు.
బయట చెప్పులు కనిపించడంతో ఎవరో వచ్చారని భావించి లోపలికి వెళ్లారు. అంతే సెకన్ల వ్యవధిలో దుండగులు ఆమె పీక నొక్కి చంపేశారు. ఈ సమయంలో సులోచన పెద్దగా అరిచింది. పక్కింట్లో ఉన్న మహిళ రాగా హంతకులు బయటకు వస్తూ ‘ఆమె (సులోచన) బాత్రూంలో ఉంది' అని చెప్పడంతో వెనక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ముఖం దాచుకుంటూ బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయాడు. దీనిపై అనుమానం వచ్చిన పక్కింటి మహిళ మళ్లీ సులోచన ఇంటికి వచ్చింది. అప్పటికే సులోచన ప్రాణాలు కోల్పోగా, సింహాచలం కొనఊపిరితో ఉన్నారు. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
దుండగుల్లో ఒకరు ఆటోలో వెళ్లిపోగా, మరో వ్యక్తి ప్రహరీ దూకి పారిపోయాడు. ప్రహరీపై ఉన్న రక్తపు మరకలను బట్టి అనుమానం కలుగుతోంది. సింహాచలం ఇంట్లో బీరువా తెరిచి ఉంది. అందులోని నగదు, ఆభరణాలు భద్రంగానే ఉన్నాయి. సులోచన చేతులకున్న గాజులు మాత్రం కనిపించలేదు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సంయుక్త కమిషనర్ శశిధర్రెడ్డి, శంషాబాద్ ఉపకమిషనర్ రమేష్నాయుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పరిశీలించారు. ఆధారాల కోసం పోలీసులు డాగ్స్వ్కాడ్, క్లూస్టీంలను రప్పించారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సింహాచలం, సులోచనను దోపిడీ దొంగలు హత్య చేసి ఆభరణాలు ఎత్తుకుపోయారని తొలుత అందరూ భావించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. బీరువాలోని ఆభరణాలు భద్రంగానే ఉన్నాయి. ఆభరణాలు చెక్కు చెదరలేదు కాబట్టి ఇది దోపిడీ దొంగల పనికాకపోవచ్చని భావిస్తున్నారు. దంపతులకు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పావని మాత్రం తన తల్లిదండ్రులకు ఎవరితోనూ విభేదాలు లేవని చెప్పారు. ఈ సంఘటనకు లంగర్హౌజ్లో జరిగిన ఘటనకు దగ్గర పోలికలు ఉండడంతో అధికారులు ఆసిఫ్నగర్ సహాయ కమిషనర్ను పిలిపించారు. సింహాచలం దంపతులకు రేపల్లెలో భూములున్నాయని సమాచారం. అక్కడ ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు
వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకీ తీసుకున్నారు. నార్సింగ్ వద్ద వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఫయాజ్, ఖలీల్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు కొంత కాలంగా పరిచయం పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.