మూడేళ్లుగా సహజీవనం: అతని వేధింపులు భరించలేక జంట ఆత్మహత్యాయత్నం
కాళేశ్వరం: సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం గోదావరి నది వద్ద చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వీరిద్దరు ఆత్మహత్యకు యత్నించగా.. అతను మృతిచెందాడు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్(48), మల్హర్ మండలం కొయ్యూర్కు చెందిన శ్యామల మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. హరినాథ్ మొదటి భార్య చనిపోవడంతో అతను శ్యామలకు దగ్గరయ్యాడు.

వీరిద్దరి సహజీవనం సాఫీగానే సాగినప్పటికీ.. శ్యామల చిన్న సోదరుడైన పండ్ల రాములుకు మాత్రం ఈ వ్యవహారం నచ్చలేదు. దీంతో పలుమార్లు వారి ఇంటికొచ్చి గొడవ చేయడం, దాడికి పాల్పడటం చేశాడు. అయినా సరే, హరినాథ్-శ్యామల కలిసే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే రాములు వేధింపులు భరించలేక బుధవారం ఉదయం 7.30గం. సమయంలో ఆ జంట ఆత్మహత్యకు యత్నించింది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్ వద్ద పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో హరినాథ్ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
స్థానికులు గమనించి 108లో వీరిని మహదేవ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. అక్కడే పడి ఉన్న చేతి సంచిలో సూసైడ్ నోట్ లభించింది.
సూసైడ్ నోట్:
శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరుచూ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. మాపై దాడి చేసి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. దీంతో చంపుతానని బెదిరిస్తున్నాడు. మీరే చావండి.. లేదా నేనే చంపుతా అంటూ హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications