Covaxin price: నాడు..వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే: కట్ చేస్తే..దేశంలోనే కాస్ట్లీయెస్ట్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ చుట్టూ వివాదాలు ముసురుకుంటోన్నాయి. కరోనాకు విరుగుడుగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ధర (Covaxin price) చూసిన తరువాత సాధారణ వినియోగదారులు గుడ్లు తేలేస్తోన్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన టీకాగా ఆవిర్భవించింది కోవాగ్జిన్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ ధర కూడా దాని దరిదాపుల్లో లేదు.
కంపెనీ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్
ఈ నేపథ్యంలో- ఇదివరకు భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా చేసిన ఓ ప్రకటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైరల్గా మారింది. సంస్థ యాజమాన్యం ద్వంద్వ వైఖరి బట్టబయలైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మాటలు చెప్పినంత సులువుగా దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని గుర్తు చేస్తోన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలో కృష్ణా ఎల్లా చేసిన ప్రకటనను.. బిజినెస్ స్ట్రాటజీగా అభివర్ణిస్తోన్నారు.

కోవాగ్జిన్ రేటెంత?
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ సహా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, రష్యా కనుగొన్న కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల రేటును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ఒక్కింటికి 780, స్పుత్నిక్ వీ 1,145 రూపాయలుగా నిర్ధారించింది. కోవాగ్జిన్ ధర 1,410 రూపాయలుగా కేంద్రం ఖరారు చేసింది. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయా రేట్లను చెల్లించి కేంద్రమే వాటిని కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
నాడు అలా..
ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ- కోవాగ్జిన్ రేటు ఏకంగా 1,410 రూపాయలుగా నిర్ధారించడం పట్ల దుమారం చెలరేగుతోంది. నెటిజన్లు ట్వీట్లతో మండిపడుతోన్నారు. తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. దేశ ప్రజల ప్రాణాలను నిలపడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన దేశీయ కంపెనీ.. అసాధారణ రేటును నిర్ధారించడం సరికాదని అంటోన్నారు. ఈ క్రమంలో- కోవాగ్జిన్ రేటు ఎలా ఉండబోతోందనే విషయంపై కృష్ణా ఎల్లా చేసిన ఓ వీడియో క్లిప్ను వైరల్గా మార్చారు.

మంచినీళ్ల బాటిల్ కంటే తక్కువకే..
మార్కెట్లో దొరికే మంచినీళ్ల బాటిల్ కంటే తక్కువ రేటుకే తాము అభివృద్ధి చేసే వ్యాక్సిన్ను దేశ ప్రజలకు అందజేస్తామంటూ గత ఏడాది భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా చేసిన వ్యాఖ్యాలను గుర్తు చేస్తోన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ విషయంపై అటు కేంద్రాన్ని, ఆటు భారత్ బయోటెక్ యాజమాన్యాన్ని ఏకిపారేస్తోన్నారు. వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకే వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని.. రియాలిటీలో మాత్రం.. దేశంలోనే అత్యంత ఖరీదైన వ్యాక్సిన్గా కోవాగ్జిన్ ఆవిర్భవించిందని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications