తెలంగాణలో విలయం: భారీగా పెరిగిన కరోనా కేసులు, 2వేలకు చేరువగా -ఒక్కరోజే 5మరణాలు -ఆ జిల్లాల్లో వేగంగా
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి జెట్ స్పీడు వేగంతో విస్తరిస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతూ, ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయికి చేరాయి. కొవిడ్ వ్యాధితో చనిపోతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్త కేసుల ఉధృతి, డిశ్చార్జీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు కుప్పలా పేరుకుపోతున్నాయి. వివరాల్లోకి వెళితే..
Recommended Video


భారీగా పెరిగిన కొత్త కేసులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే 74,274 శాంపిళ్లను పరీక్షించగా, మొత్తం 1914 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ ఏడాదిలో ఒకే రోజు నమోదైన కొత్త కేసులో ఇదే రికార్డు కావడం గమనార్హం. అంతకు ముందు రోజు(మంగళవారం) కొత్త కేసులు 1498కాగా, 24 గంటల వ్యవధిలో వైరస్ మరింత వ్యాప్తి చెందిందనానికి గుర్తుగా 1914 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి పెరిగింది.

పిట్టల్లా రాలిపోతున్నారు..
కొత్త కేసులతోపాటు కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఐగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,734కు పెరిగింది. సోమవారం మరణాల సంఖ్య 6గా నమోదైన సంగతి తెలిసిందే. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.3శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం అది 0.54శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రతి పది లక్షల మందిలో 2.84లక్షల మందికి టెస్టులు చేశామన్న ప్రభుత్వం.. మొత్తం శాంపిళ్ల సంఖ్య ను 1.05కోట్లుగా పేర్కొంది. ఇక..

తగ్గుతోన్న రికవరీ రేటు..
రికవరీల్లో దేశంలోనే దాదాపు టాప్ లో ఉండిన తెలంగాణలో ఆ రేటు క్రమంగా పడిపోతున్నది. నిన్న ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 285మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,03,299కి పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.1 శాతం కాగా, తెలంగాణలో అదింకా 95.78 శాతంగా కొనసాగుతున్నట్లు బులిటెన్ లో తెలిపారు. కొత్త కేసుల పెరుగుదలతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,617కు చేరాయి. వారిలో 6,634మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు.

ఉత్తర తెలంగాణలో వేగంగా..
వైద్య శాఖ తాజా బులిటెన్ లో పేర్కొన్న 1914 కొత్త కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్కరోజే 393 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 205, రంగారెడ్డి జిల్లాలో 169 కేసులురాగా, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వచ్చాయి. నిజామాబాద్ లో 104, నిర్మల్ జిల్లాలో 179, కరీంనగర్ లో 80, జగిత్యాలలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications