తెలంగాణ: కరోనా తగ్గి, బ్లాక్ ఫంగస్ విజృంభణ -గాంధీలో 3, భైంసాలో 5 కేసులు -4693 కొవిడ్ కేసులు, 33 మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా, మరో ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగస్ పడగవిప్పుతోంది. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తారు. దీనిబారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారు. హైదరాబాద్ లో అతిపెద్ద కొవిడ్ సెంటర్ గాంధీ ఆస్పత్రిలోనే మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భైంసాలోనూ 5 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడగా, ఒకరు మరణించారు. ఇక

కొత్తగా 4,693 కేసులు, 33 మరణాలు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 71,221 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 4,693 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొవిడ్ కారణంగా 33 మంది చనిపోయారు. తద్వారా మరణాల సంఖ్య 2,867కు చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.55శాతం ఉంది.

మెరుగైన రికవరీ రేటు..
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6,876 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,56,620 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 83.2శాతం ఉండగా, తెలంగాణలో అది 88.42శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 734 కొత్త కేసులు వచ్చాయి. ఇదిలా ఉంటే,

మే 31 వరకు రెండో డోసు టీకాలు..
వ్యాక్సిన్ల కొరత కారణంగా 18 నుంచి 44 ఏళ్ల వారికి ఇప్పట్లో టీకాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మే 31 వరకు రెండోడోసు వారికే వ్యాక్సిన్ ఇస్తామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్డౌన్ విధించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. ప్రజలు బయటకు వచ్చిన సమయంలోనూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.












Click it and Unblock the Notifications