తెలంగాణలో కరోనా: మరో 49మంది బలి -కొత్తగా 5,695 కేసులు -ఇక జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే
తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదరకంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించినా, ఆదివారం సెలవు దినం టెస్టులు తగ్గడంవల్లేగానీ వైరస్ వ్యాప్తిలో తేడా వల్ల కాదు. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో యధావిధిగా కొత్త కేసులు భారీగా వచ్చాయి..
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 58,742 శాంపిల్స్ సేకరించగా.. వారిలో 5,695 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,56,485కు పెరిగింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.52శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

కొత్త కేసులు భారీగా వస్తున్నప్పటికీ కోలుకుంటున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్కరోజే 6,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 3,73,933కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 81.91శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 80,135 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా,
కొత్త కేసుల్లో చాలా వరకు జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,352 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో 427 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 393, వనపర్తి -101, వికారాబాద్-109, సిద్ధిపేట-238, సంగారెడ్డి-249, రంగారెడ్డి-483, నిజామాబాద్-258, నాగర్కర్నూల్-132, మంచిర్యాల-165, మహబూబాబాద్-119, మహబూబ్నగర్-221, ఖమ్మం-121, కరీంనగర్-231, జగిత్యాల-190, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 108 చొప్పున కొత్త కేసులు వచ్చాయి. ఇదిలా ఉంటే,
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో కొవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని.. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ స్టాఫ్, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం ఉండేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications