కరోనా: కేసీఆర్ సర్కారుకు వారం గడువు.. గవర్నర్ వద్దకు సీఎస్, హెల్త్ సెక్రటరీ..
ప్రభుత్వ, అధికార టీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో సీఎం కేసీఆర్ కు కరోనా సోకిందనే ప్రచారం ఇంకా కొనసాగుతోంది. కొవిడ్ నయంత్రణలో ప్రభుత్వం ఫెయిలైందన్న ప్రతిపక్ష నేతలు.. కనీసం ముఖ్యమంత్రి ఆరోగ్య గురించైనా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం సిటీలో లేనివేళ కరోనాకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు కొవిడ్ పేషెంట్ల ట్రీట్మెంట్ లో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు డెడ్ లైన్ విధించింది.

గవర్నర్ తో సీఎస్ భేటీ..
కొవిడ్ పేషెంట్ల కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, అధిక ఫీజుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై మంగళవారం వివిధ ఆస్పత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలుసుకున్నారు.

హైదరాబాద్ కేసులపై ఆరా..
సీఎస్, హెల్త్ సెక్రటరీతో భేటీలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రవేటు ఆసుపత్రుల దోపిడీ, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసుల నమోదు తదితర అంశాలపై గవర్నర్ ఆరా తీయగా, ఆమె అడిగిన పలు ప్రశ్నలకు అధికారులిద్దరూ వివరణ ఇచ్చారు. నిజానికి ఈ ఇద్దరినీ సోమవారమే తన వద్దకు రావాల్సిందిగా గవర్నర్ ఆదేశించినా.. అత్యవసర పనుల వల్ల రాలేకపోతున్నామని బదులిచ్చారు.

పరాకాష్టకు ప్రైవేటు దోపిడీ..
స్వల్ప కరోనా లక్షణాలతో చాదర్ ఘాట్ లోని తుంబే ఆస్పత్రిలో చేరిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానా నుంచి ఒక్క రోజుకే 1.15లక్షల బిల్లు వసూలు చేయడం సంచలనం రేపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సైతం తనకు తెలిసినవాళ్ల కేసును ఉదహరిస్తూ, హైదరాబాద్ కే చెందిన ఓ పెద్ద ఆస్పత్రిలో 9రోజుల ట్రీట్మెంట్ కు రూ.10లక్షలకుపైగా బిల్లు వేసిందని తెలిపారు. ప్రజల్లో కరోనా భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఏడు రోజుల గడువు..
హైదరాబాదులోని కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్, చికిత్సకు ప్రభుత్వం అనుమతించిన దరిమిలా సూచించిన దానికంటే పేషెంట్ల నుంచి అధికంగా డబ్బులు గుంజుతున్నారని, ఈ దోపిడీని అరికట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ జారీ అయిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. అనంతరం, ఈ వ్యవహారంలో కచ్చితమైన వివరణలతో కూడిన సమాధానం చెప్పాలంటూ కోర్టు.. కేసీఆర్ సర్కారుకు వారం గడువిచ్చింది. అధిక ఫీజుల వ్యవహారానికి సంబంధించి కేర్, యశోద, సన్ షైన్, మెడికవర్ తదితర ఆస్పత్రులకు కూడా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications