పుష్కరాల్లో మరోసారి మొసలి కలకలం, భక్తుల పరుగు
కరీంనగర్: గోదావరి పుష్కరాలలో మరోసారి మొసలి కలకలం రేగింది. బుధవారం నాడు మల్లాపూర్ మండలం పాత ధర్మాజీపల్లి పుష్కర ఘాట్ వద్ద మొసలి ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారు అక్కడి నుంచి పరుగు పెట్టారు.
మొసలి కనిపించిన విషయాన్ని స్థానిక జాలర్లకు, అధికారులకు తెలిపారు. వారు వచ్చి మొసలిని పట్టుకొని, అక్కడి నుంచి తరలించారు. పుష్కర ఘాట్ వద్ద ఆ సమయంలో పెద్దగా జన సందోహం లేదు. దీంతో ప్రమాదం తప్పింది.
పుష్కరాల ఘటన తొలి రోజు ధర్మపురిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుణ్య స్నానం చేస్తుండగా ఆయన సమీపంలో పాము ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలోను మొసలి కనిపించింది. ఇప్పుడు మరోసారి ప్రత్యక్షమైంది.
కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
గోదావరి పురష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో పుష్కరాలకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
ధర్మపురి - కోటిలింగాల, జగిత్యాల - ధర్మపురి మధ్య దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.