ఏపీ నుండి హైదరాబాద్ కు రిటర్న్ జర్నీ చేసేవారికి కీలక అలెర్ట్.. అక్కడ ట్రాఫిక్ డైవర్షన్!
నేటితో సంక్రాంతి పండగ ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మళ్ళీ ప్రజలు తాము జీవిస్తున్న, ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు తరలి వెళ్తారు. ఏపీ నుండి ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి ఒకేసారి భారీగా వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ రద్దీ నివారణకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్ళింపులు
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే-65 పై చిట్యాల, పెద్ద కాపర్తి ప్రాంతాల్లో ప్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్టు తెలిపారు.

గుంటూరు, మాచర్ల నుండి హైదరాబాద్ కు ప్రత్యామ్నాయ మార్గాలు
హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా వెళ్లాలని సూచించారు. మాచర్ల నుంచి వచ్చే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి మార్గాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ నుండి, విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రత్యామ్నాయం
అలాగే నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మార్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా ప్రయాణించాలని సూచించారు. విజయవాడ నుంచి వచ్చే భారి వాహనాలు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ఎన్హెచ్-65 పై ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్కు దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు
ఈ మార్గాల వినియోగంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. పండగ రోజులలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని నల్గొండ జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications