మ్యాట్రిమోనిలతో యువతులకు గాలం : సైబరాబాద్ పోలీసులకు చిక్కిన శశిధరన్
హైదరాబాద్ : పెళ్లిళ్ల పేరుతో పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతూ వస్తోన్న శశిధరన్ కత్తిరి అనే బెంగుళూరు వాసిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన శశిధరన్.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును దోచుకున్నాడు.
హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన ఓ బాధితురాలు కూడా ఇతడి చేతిలో మోసపోవడంతో.. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు.. శశిధర్ నేర చరిత్ర మొత్తం బయటపెట్టారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. బెంగుళూరుకు చెందిన శశిధరన్ కత్తిరి(43) పెళ్లిళ్ల పేరుతో యువతుల వద్ద నుంచి డబ్బు దోచేయడమే పనిగా పెట్టుకున్నాడు. మ్యాట్రిమోనిల ద్వారా యువతులకు గాలం వేసే ఇతగాడికి.. ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో జీవన్ శాంతి డాట్ కామ్ లో తన వివరాలను నమోదు చేసి పెళ్లి పేరుతో యువతులకు గాలం వేయడం మొదలుపెట్టాడు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన ఓ యువతి ఈ నెల 10వ తేదీన తన వివరాలను జీవన్ శాంతి డాట్ కామ్ లో నమోదు చేసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సదరు యువతిని వెబ్ సైట్ ద్వారా కోరాడు శశిధర్. ఇందుకు యువతి కూడా ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అలా చివరికి ఇద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమైంది.
ఇదే క్రమంలో తానో యూకే ఎన్నారైగా యువతిని నమ్మించిన శశిధరన్.. వీసా పేరుతో యువతి నుంచి రూ.7,50,000 కాజేశాడు. శశిధర్ తనను మోసగిస్తున్నాడని తెలియని సదరు యువతి విజయ బ్యాంకు ద్వారా ఆ మొత్తాన్ని అతని ఖాతాలో జమచేసింది. ఇదిగాక పెళ్లి పేరిట ఇచ్చే కట్న కానుకల రూపంలో ఓ ఉంగరం, గోల్డ్ చైన్, 32వేల విలువ చేసే సోని మొబైల్ ఫోన్ ను కూడా యువతి కుటుంబం నుంచి తీసుకున్నాడు.
ఇక్కడిదాకా అంతా సజావుగానే జరుగుతుందన్నకున్న యువతి కుటుంబానికి.. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి అసలు నిజం తెలిసింది. యువతి నుంచి పలు వస్తువులు, బంగారంతో పాటు నగదును కాజేసిన శశిధరన్.. ఆ తర్వాత తన ఫోన్ నంబర్ మార్చేసి కాంటాక్ట్ లో లేకుండా పోయాడు. దీంతో శశిధరన్ తనను మోసం చేశాడని గ్రహించింది బాధిత యువతి. ఆరా తీస్తే.. అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో షాక్ తిన్నది.
ఏంచేయాలో పాలుపోని స్థితిలో పోలీసులను ఆశ్రయించి శశిధరన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసింది. దీంతో శశిధరన్ కోసం ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపింది పోలీస్ యంత్రాంగం. సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, ఎస్సైలు విజయవర్ధన్, శేఖర్ లతో కూడిన టీమ్ ను బెంగుళూరుకు పంపించింది. దీంతో బెంగుళూరులో అతడిని పట్టుకున్న పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
కాగా, శశిధరన్ భార్య కూడా అతనిపై కట్న వేధింపుల కింద నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శశిధరన్ వల్ల మోసానికి గురైన బాధితులెవరైనా ఉంటే.. 9490617347 ద్వారా విచారణ అధికారిని సంప్రదించాలని తెలిపారు పోలీసులు.












Click it and Unblock the Notifications