విధి నిర్వహణలో ప్రాణాలో కోల్పోయిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి: పాడె మోసిన సజ్జనార్
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. రెండ్రోజుల కిందట ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గత శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో నిజాంపేట రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
మద్యం మత్తులో కారుతో ఢీకొట్టాడు..
ఈ సమయంలోనే అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి.. మద్యం మత్తులో ఒక్కసారిగా ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి, పోలీసు సిబ్బందిపైకి కారు పోనిచ్చాడు. దీంతో ఏఎస్ఐకి తీవ్రగాయాలయ్యాయి. మరికొద్దిసేపటికే ఆ ప్రాంతంలో మరో వ్యక్తి కారుతో హోంగార్డును ఢీకొట్టాడు. దీంతో గాయాలపాలైన పోలీసులందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి, అవయవాలు దానం
ఈ క్రమంలో కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా, బ్రెయిన్ డెడ్ అయిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి అవయవాలను ఆయన కుటుంబసభ్యులు దానం చేశారు. అధికారుల సమక్షంలో కిడ్నీ, లివర్ను జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థకు అందజేశారు.
ఏఎస్ఐ పాడె మోసిన సజ్జనార్ ఆవేదన
కాగా, కిస్మత్పూర్లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద అంత్యక్రియలు జరిగాయి. చివరిసారిగా మహిపాల్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రజలు చేరుకున్నారు. అదనపు డీజీపీ సజ్జనార్.. మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా, ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్ రూ. 50వేలు వ్యక్తిగత సహాయం చేశారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మహిపాల్ రెడ్డి జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదే పదే చెబుతున్నా.. వినడం లేదని, మహిపాల్ రెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.