పోలీసులు గాజులు తొడుక్కోలేదు: వనస్థలిపురం ఘటనపై కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పోలీసుల వైఫల్యముందని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు మెమోలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
వనస్థలిపురంలోనే ఇప్పటి వరకూ ఆరువేల చైన్ స్నాచింగ్లు జరిగాయన్నారు. నేరం చేసిన వారిని పట్టుకుంటే ఆ వెంటనే బెయిల్ రావడంతో నేరస్తుల్లో భయం లేదన్నారు. దాంతో కొత్త కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారన్నారు. వనస్థలిపురం చైన్ స్నాచింగ్ ఘటన తర్వాత పోలీసులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా 55 వెపన్స్తో కూడిన యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీమ్లు ఇప్పటికే నగరంలోని చైన్ స్నాచింగ్ హోట్ స్పాట్ల్లో మొహరించి ఉన్నాయన్నారు. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న హైవేలకు దగ్గరగా ఉన్న కాలనీపై నిఘా పెట్టామన్నారు.
ఫేజ్ 2 ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఒక లెవెల్కు వచ్చారన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఘటనలో పాల్గొన్న పోలీసులు చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకోవాల్సిందేన్నారు. చైన్ స్నాచింగ్ నిందితులపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నామన్నారు.
వనస్థలిపురం చైన్ స్నాచింగ్ ఘటనపై నగర ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఏమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని చైన్ స్నాచింగ్ నిందితులకు గట్టి హెచ్చరిక చేశారు. ట్రైనింగ్ పూర్తి చేసుకన్న పోలీసులు ఫీల్డ్ లెవెల్లో ఓ స్థాయి యాక్షన్కైనా సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇటీవల జరిగిన ఓ చైన్ స్నాచింగ్ ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ చనిపోగా, మరో ఎస్సై చనిపోతూ బతికాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే వెపన్స్ ఇచ్చామని సమర్ధించుకున్నారు. ఎలాగైనా సరే ఈ చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకొని తీరుతామన్నారు.