స్నేక్ గ్యాంగ్ కేసును ఛేదించినట్లే టెక్కీ కిడ్నాప్, రేప్ కేసును కూడా..
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసును ఛేదించి దోషులకు అనతికాలంలోనే శిక్ష పడేలా చేసిన సైబరాబాద్ పోలీసులు గతంలో కూడా ఓ కీలకమైన కేసును ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. తద్వారా మహిళల్లో విశ్వాసం పాదుకొల్పే పని చేశారు. అప్పట్లో అభయ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
2013 అక్టోబరులో జరిగిన అభయ కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేయడంలో పోలీసులు అత్యంత నిబద్ధతతో వ్యవహరించారనే ప్రశంసలు అందుకున్నారు. అభయ కేసులో సైబరాబాద్ పోలీసులు ఏడు నెలల్లో కోర్టు తీర్పు వచ్చేలా శ్రమించారు.
2013 అక్టోబరు 22న సాఫ్ట్వేర్ ఉద్యోగి తన విధులు ముగించుకుని ఇనార్బిట్ మాల్కు వెళ్లి అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుని గౌలీదొడ్డిలోని తన హాస్టల్కు వెళ్ళేందుకు మైండ్ స్పేస్ జంక్షన్కు వచ్చింది. అక్కడ ట్యాక్సీ ప్లేటుతో ఉన్న ఖరీదైన వోల్వా క్యాబ్ వచ్చింది. 50 రుపాయాల అద్దెకు తన హాస్టల్కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది.

కారు ఎక్కగానే తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుకుంటుండగా డ్రైవర్ సతీష్, అతని స్నేహితుడు వెంకేటేశ్వర్లు బయోడైవర్సిటీ దగ్గర రూటు మార్చి రాయదుర్గం పీఎస్ వెనకాల నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మెదక్ వైపు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పితే చంపేస్తామని బెదిరించాడు. అయితే ఫోన్లో మాట్లాడుతున్న స్నేహితుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆపదలో ఉందని గ్రహించి తన స్నేహితుల ద్వారా సైబరాబాద్ పోలీసులను ఫిర్యాదు చేశాడు. ఇలా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగిని లైంగిక దాడి కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటనపై ప్రాథమిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ పోలీసులు యువతి వివరాలు బయటికి వెళ్తే ఆమె పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో యువతి సంఘటనను అభయ సంఘటనగా పేరు పెట్టారు. అభయ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఓ సీసీ కెమెరా క్లూను లాగారు. అలా మొదలు పెట్టి రెండు రోజులలో కేసు మిస్టరీని చేధించి డ్రైవర్ సతీష్, అతని స్నేహితుడు వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. నిర్ణీత గడువు 90 రోజులలో పూర్తి ఆధారాలతో కూడిన ఛార్జీ షీటును దాఖలు చేశారు.
అభయ కేసు విచారణను వేగవంతం చేసేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కృషి చేసి దాన్ని సాధించారు. రంగారెడ్డి కోర్టులో ఏర్పాటైన ఈ కోర్టులో ఏడు నెలలో విచారణను పూర్తి చేసి దుండగులకు 20 సంవత్సరాల జైలు శిక్షపడేలా సైబరాబాద్ పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ఈ కేసులో అభయ ప్రయాణించిన రూటు, లైంగిక దాడికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, సీసీ కెమెరాల వీడియోలు, డీఎన్ఏ రిపోర్టులు, ఫోరెన్సిక్ నివేదికలను సమయానుసారంగా సంపాదించి పోలీసులు బాధ్యతను సమగ్రవంతంగా నిర్వహించారు.
అభయ కేసులో ఓ సాక్షి విదేశాలలో ఉండడంతో అతని కోర్టు విచారణలో అతని వాంగ్మూలాన్ని వినిపించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఆన్లైన్లో అతని సాక్షాన్ని కోర్టు విచారణలో నిర్వహించారు. అత్యంత జాగ్రత్తగా అభయ ఆచూకీ వివరాలను బయటికి రాకుండా సైబరాబాద్ పోలీసులు పోలీసులు వ్యవహరించారు.












Click it and Unblock the Notifications