కారు డబ్బున్నోడిది, సైకిల్ పేదోడిది: నారా లోకేష్ కొత్త స్లోగన్
హైదరాబాద్: కారు డబ్బున్నోడిది, సైకిల్ పేదోడిదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో కొత్త నినాదం ఇచ్చారు. తమ పార్టీ బలహీనవర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు.
మంగళవారం మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపిస్తే 6 నెలల్లో హైదరాబాద్లో నీటి కష్టాలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని నారా లోకేశ్ అన్నారు.
Photos: నారా లోకేష్ జిహెచ్ఎంసి ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని, అవి నమ్మి మోసపోవద్దని అన్నారు. హుస్సేన్సాగర్ను శుభ్రం చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని లోకేష్ అన్నారు.
తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వ సహకారం అవసరం లేదని అన్నారు. జీహెచ్ఎంసీకి రూ.8 వేల కోట్ల నిధులున్నాయని ఎర్రబెల్లి చెప్పారు.