విధేయుడిగా ఉంటే నచ్చలేదు: డిగ్గీరాజా కొంపముంచారని డీఎస్ ఆవేదన
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, వివాదరహింతగా, ప్రతి ఒక్కరితో సమన్వయంగా పని చేసుకుంటూ వెళ్లడం కొందరు పెద్దలకు నచ్చడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత డీ. శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సన్నిహితులతో డీఎస్ తన మనోభావాలను పంచుకున్నారు. తనకు శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ను రానీయకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని డీఎస్ తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తనకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించినా, దిగ్విజయ్ సింగ్ మాత్రం ఈర్ష్య, అసూయతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రెండు రాష్ట్రాల నేతల తీరుతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. అనవసరంగా, అసందర్భంగా సెక్షన్-8ను తెరపైకి తెచ్చి, ప్రశాంతంగా జరిగిన రాష్ట్ర విభజనను గందరగోళపర్చాలని చూస్తున్నారు. అన్ని భాషలు మాట్లాడేవారు హైదరాబాద్లో సుఖశాంతులతో నివసిస్తున్నారు. ఇలాంటి ప్రశాంతపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేలా, ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడేలా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ సంఘటనలు, పరిణామాలు మంచివి కావు'' అని డీఎస్ అన్నారు.
‘‘అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? సెక్షన్ను ఎందుకు అమలు చేయమంటున్నారు? సెక్షన్ను అమలు చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ సీఎం కేసీఆర్ అంటున్నారు. మరి ఆ రోజే చంద్రబాబు ఆమరణ దీక్ష చేస్తానని ఎందుకు చెప్పలేదు? సెక్షన్ను అమలు చేయకపోతే రాష్ట్ర విభజన వద్దంటూ ఆయన ఎందుకనలేదు?'' అని డీఎస్ ప్రశ్నించారు.