డైలీ లేబర్ని ఐటీ ఉద్యోగులుగా చేశారా...? తెలంగాణ బాబు ప్రచారంలో విచిత్రం
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రాంతీయ పార్టీ అధినేతలతో పాటు జాతీయపార్టీ అధినేతలు కూడా రంగంలోకి దిగడంతో చలికాలంలో ఎలక్షన్ హీట్ పుడుతోంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయనతో పాటు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ప్రచారంలో చంద్రబాబు కేసీఆర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక రెండో రోజు శేరిలింగంపల్లిలో బాబు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ నిర్మాత కులీ కుతుబ్ షా..సైబరాబాద్ నిర్మాత నేనే
శేరిలింగం పల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ తరుపున ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. సాధారణంగా తన ప్రచారంలో హైదరాబాద్ నిర్మాత కులికుతుబ్షా అయితే సైబరాబాద్ నిర్మాత తనే అంటూ చంద్రబాబు ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. నాడు హైదరాబాద్కు హైటెక్ సిటీ వచ్చిందంటే అది తన చొరవేనంటూ చెప్పారు. అంతేకాదు పలు మల్టీ నేషనల్ కంపెనీలు భాగ్యనగరానికి క్యూ కట్టాయంటే దాని వెనక తన కష్టం చాలా ఉందని గుర్తు చేశారు.
వైరల్ అయిన ఐటీ ఉద్యోగుల ఫ్లకార్డుల ఫోటోలు
చంద్రబాబు ప్రచారంలో ఐటీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. కానీ నిజంగా ఐటీ ఉద్యోగులే తన ప్రచారంలో పాల్గొన్నారా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఎందుకంటే శేరిలింగంపల్లి ప్రచారంలో కొందరు ఫ్లకార్డులు ప్రదర్శించారు. " CBN YOU ARE MY HERO", "BECAUSE OF YOU WE ARE HERE", అంటే చంద్రబాబు మీరే మా హీరో, మీ వల్లే మేము ఇక్కడ ఇలా ఉన్నాం అని అర్థం వచ్చేలా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఫోటోలను కాస్త లోతుగా పరిశీలిస్తే ట్విస్టు కనిపిస్తుంది.
డైలీ లేబర్ను ఐటీ ఉద్యోగులుగా మార్చిన తెలుగు తమ్ముళ్లు
వాస్తవానికి ఈ ఫ్లకార్డులు పట్టుకుంది ఐటీ ఉద్యోగులు కాదు... ఆ ఫోటోను కాస్త జూమ్ చేసి ఫ్లకార్డులు పట్టుకున్న చేతులను గమనిస్తే అవి ఐటీ ఉద్యోగి చేతుల్లా లేవు. రోజువారి కూలీకి వెళుతున్న వృద్ధుడి చేతుల్లా ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తున్నాయి. టీడీపీ మాత్రం పెద్ద ఎత్తున ప్రచారంలో ఐటీ ఎంప్లాయిస్ పాల్గొన్నారని ఈ ఫ్లకార్డుల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తోందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు తాను ఐటీని పరిచయం చేశానని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రచారంలో ఇలాంటి కలరింగ్ కాస్త కనిపిస్తే బాగుంటుందని భావించి తెలుగు తమ్ముళ్లు ఇలా ప్లాన్ చేసి ఉంటారని అక్కడికి గుమికూడిన వారు చెవులు కొరుక్కున్నారు. మొత్తానికి డైలీ లేబర్ను చంద్రబాబు ఐటీ ఉద్యోగులను చేశారంటూ ఛలోక్తులు విసురుకున్నారు అక్కడికి చేరి వచ్చిన జనం.