టీఆర్ఎస్ తో దక్షిణాయనం పూర్తి...బీఆఆర్ఎస్ తో ఉత్తరాయణం మొదలు
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై పండుగనాడు కూడా విరుచుకుపడ్డారు. అంతేకాదు పార్టీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశానికి కొత్త క్రాంతి ఇచ్చే పార్టీ బి.ఆర్.ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజలు గర్వించే నూతన గమనానికి ఖమ్మం గుమ్మం నుంచి నాంది
టి.ఆర్.ఎస్ తో దక్షిణాయనం పూర్తి...బి.ఆర్.ఎస్ తో ఉత్తరాయణం మొదలు అంటూ పేర్కొన్న ఆయన సంక్రాంతితో రాష్ట్రం నుంచి దేశం వైపు గమనం మొదలైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18న ఉత్తరాయణం చేసేందుకు ఖమ్మం నుంచి బి.ఆర్.ఎస్ తొలి అడుగు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే నూతన గమనానికి ఖమ్మం గుమ్మం నుంచి నాంది మొదలవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు పండగ సంక్రాంతి నుంచి రైతు రాజ్యం లక్ష్యంగా భారత రైతు సంక్షేమం కోసం బి.ఆర్.ఎస్ ప్రస్థానం మొదలవుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చెయ్యాలన్న ఎర్రబెల్లి
టి.ఆర్.ఎస్ పార్టీతో దక్షిణ భారతంలో అభివృద్ధికి అర్దం చెప్పి, ఉత్తర భారతంలో ఉదయించే సూర్యుడిగా అవతరించిన బి.ఆర్.ఎస్ పార్టీ, దేశంలో రైతు సర్కారును తీసుకురానున్న సందర్భంగారాష్ట్ర, దేశ ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం గుమ్మం నుంచి భారత రైతు సంక్షేమం లక్ష్యంగా జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను విజయవంతం చేసి దేశంలో కొత్త క్రాంతి తీసుకురావడానికి తెలుగు ప్రజలు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీజేపీలను లెక్కలోకి తీసుకోము
అంతేకాదు కేంద్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. రైతుబంధు ఇచ్చే ప్రభుత్వం దేశంలోనే ఒక్క తెలంగాణ ప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు లాభం జరిగింది నిజం కాదా అంటూ ప్రశ్నించిన ఎర్రబెల్లి బిజెపి, కాంగ్రెస్ పార్టీలను లెక్కలోకి తీసుకోమని, మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ పార్టీనే వస్తుందని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తుందని ఆరోపించిన ఆయన, దేశంలో బిజెపి కి చెక్ పెట్టి, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈనెల 18 నుంచి నుంచి రైతు రాజ్యం కోసం తొలి అడుగు
తెలుగు తేజం, మన ఠివి పీవీ ప్రధానిగా దేశాన్ని పాలించి తెలంగాణ సత్తా చాటిన గడ్డ నుంచి భారత దేశ భవిష్యత్ తీర్చిదిద్దడానికి, భారత రూపు రేఖలు మార్చి, రైతు రాజ్యాన్ని తెచ్చే సంకల్పంతో బి.ఆర్.ఎస్ ఆవిర్భవించడం పట్ల తెలుగు ప్రజలు గర్వించాలన్నారు. పంటలు ఇంటికి వచ్చి రైతులు సంతోషంగా ఇంటిల్లిపాది సంబరం చేసుకునే పండుగ సంక్రాంతి తరవాత ఈనెల 18 నుంచి నుంచి రైతు రాజ్యం కోసం తొలి అడుగుగా సభ పెట్టడం శుభారంభం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఈ దేశాన్ని శాసించాలి అన్న సంకల్పానికి ప్రజలంతా ఆశీస్సులు అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications