ఆ వర్గానిదే డామినేషన్, రాహుల్కు చెప్పినా..: పార్టీ వీడటంపై దానం, ‘సత్తా ఏంటో చూపిస్తా’
Recommended Video

హైదరాబాద్: గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించానని ఆ పార్టీకి రాజీనామా చేసిన నేత, మాజీ మంత్రి నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకెన్నో పదవులు ఇచ్చిందని చెప్పారు. తనకు ఇచ్చిన ప్రతీ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించానన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన బాధ్యతకు న్యాయం చేశానని చెప్పారు. అయితే, తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారని చెప్పారు. ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీపై విశ్వాసం మరింత సన్నగిల్లేలా చేశాయని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.

రాహుల్ గాంధీకి చెప్పినా..
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినా ఫలితం లేకపోయిందని దానం నాగేందర్ చెప్పారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను వివరించినా సరైన స్పందన లేదని చెప్పారు.

బీసీలు మాట్లాడటమే కష్టం
డీఎస్, కేకే తదితర లాంటి నేతలు పార్టీని విడిచి వెళ్లారని చెప్పారు. ఆత్మాభిమానం లేని చోటు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకే వర్గానికి ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. 1.60కోట్ల మంది బీసీలున్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీసీ నేతలకు స్థానం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో సభలు పెడితే బీసీ నేతలకు మాట్లాడే అవకాశం కూడా రావడం కష్టమేనని అన్నారు. ఒకే వర్గానికి చెందిన వారికే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందని మరోసారి చెప్పారు.

బీసీలకు కీలక పదవులు రాకుండా..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు ఇతర వర్గం నేతలు బలహీన వర్గాలకు కీలక పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. సీనియర్ నేత వీ హనుమంతరావు పార్టీలో ఉన్నారంటే ఉన్నారు, కానీ, ఆయనకు కూడా తగిన ప్రాధాన్యత లేదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు వరంగల్లో సమావేశం పెట్టినా సమాచారం ఉండదని అన్నారు.

ఎదగనీయడం లేదు.. సత్తా ఏంటో చూపిస్తాం
తెలంగాణలో 50శాతానికి పైగా బీసీలుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం వారికి అవకాశం లేదని అన్నారు. ఎంతకష్టపడినా ఎదగనీయడం లేదని అన్నారు. ఇతర పార్టీల్లో అలా లేదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చేస్తే చనిపోతారనే నేతలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ సత్తా ఏంటో రేపు(ఆదివారం) చూపిస్తామని దానం స్పష్టం చేశారు.

మనోవేదనతోనే..
కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీన వర్గాల నేతలు, కార్యకర్తల మనోవేదనను అధిష్టానం పట్టించుకోవడం లేదని దానం నాగేందర్ ఆరోపించారు. తనతోపాటు మాజీ కార్పొరేటర్లు, పీసీసీ బేరర్లు, నేతలు, భారీగా కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి బయటికి వస్తున్నారని చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనో వేదనకు గురయ్యే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications