బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్: సొంత ఇంటికి వచ్చినట్టుంది! స్వాగతించిన నేతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు శ్రవణ్. దాసోజు శ్రవణ్ తోపాటు ఆయన మద్దతుదారులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.
జేపీలో చేరిన దాసోజు శ్రవణ్
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు తదితర నేతలు పాల్గొని దాసోజును పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం చాలా సంతోషకరమని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు వారు కృషి చేస్తారన్నారు.
బీజేపీ, ఆర్ఎస్తో అనుబంధంపై దాసోజు శ్రవణ్
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ ఛుగ్, కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావు, లక్ష్మణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. తాను విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని, ఆర్ఎస్ఎస్తో కూడా తనకు అనుబంధం ఉందన్నారు. ఇప్పుడు సొంతింటికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు దాసోజు శ్రవణ్.
తెలంగాణను అప్పుల రాష్ట్రం శారంటూ కేసీఆర్పై దాసోజు ఫైర్
60 వేల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కసాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. 30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. లక్షా15వేల కోట్లకు పెంచిందని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దాసోజు చేరిక తెలంగాణ బీజేపీలో మంచి పరిణామం
మరోవైపు, దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం మంచి పరిణామమని అన్నారు మాజీ ఎంపీ వివేక్. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దాసోజును పార్టీ నుంచి పంపించారన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.