'రాజయ్య కోడలు సారిక పిరికిది కాదు': అనిల్ను 2సార్లు ప్రశ్నించిన పోలీసులు
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సారికకు, ఆమె భర్త అనిల్కు ఎప్పుడూ సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రేయాన్ సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.
దీనిపై స్థానికులు, పని మనిషి స్పందించారు. ఇంట్లో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు మాత్రమే ఉంటున్నారని చెబుతున్నారు. రాజయ్య దంపతులు, కొడుకు అనిల్ వేరుగా ఉంటున్నారని తెలిపారు. సారిక, అనిల్ మధ్య ఎప్పుడూ సఖ్యత లేదన్నారు.
ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా సారిక తల్లడిల్లిపోతుందన్నారు. గ్యాస్ పేలి ప్రమాదం జరిగితే.. గ్యాస్ మంటలు భవనం మొత్తం రావాలి కదా అని అనుమానిస్తున్నారు.
ఏడాది నుంచి ఇంట్లో సారిక తన పిల్లలతో కలిసి ఉంటుందని పని మనిషి చెప్పారు. 2002లో రాజయ్య కొడుకు అనిల్, సారికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, సంఘటన స్థలాన్ని సిపి, డిఎస్పీ, క్లూస్ టీం పరిశీలించింది. సారిక సొంతూరు నిజామాబాద్ జిల్లా వడ్లూరి ఎల్లారెడ్డి.
రాజయ్య కుమారుడు అనీల్ను ప్రశ్నించిన పోలీసులు
రాజయ్య ఇంట్లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం పైన రాజయ్య తనయుడు అనీల్ను పోలీసులు ప్రశ్నించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు అనీల్ను రెండు దఫాలుగా ప్రశ్నించారు.
మంగళవారం రాత్రి ఏం జరిగింది? ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? తదితరాల పైన పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది. ఘోర విషాదం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజయ్య నివాసం వద్దకు తరలి వస్తున్నారు.