అత్త అలా చేసిందని!: రెండు కాళ్లు నరికేసింది.. కోడలి ఉన్మాదం
ఆస్తుల తగాదా అత్తను నరికేదాకా వెళ్లింది. ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు అత్త రెండు కాళ్లను నరికేసింది. కూతురి పేరిట ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
భువనగిరి: ఆస్తుల తగాదా అత్తను నరికేదాకా వెళ్లింది. ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు అత్త రెండు కాళ్లను నరికేసింది. కూతురి పేరిట ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఘటన చోటు చేసుకుంది.
చౌటుప్పల్కు చెందిన చెందిన ముచ్చెర్ల రాములు, మంగమ్మ (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరికి స్థానికంగా రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వికలాంగురాలైన చిన్న కుమార్తె సుజాత పేరు మీద ఇటీవల ఓ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న కోడలు జయశ్రీ అత్తతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.
ఇదే విషయమై అత్త-కోడళ్ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణ రూపం దాల్చి.. అత్త మంగమ్మను జయశ్రీ రోకలిబండతో చావబాదే దాకా వెళ్లింది. తొలుత రోకలి బండతో ఆమెపై దాడి చేసిన కోడలు.. ఆపై ఓ పదునైన ఆయుధంతో ఆమె రెండు కాళ్లను నరికేసింది.
మంగమ్మ ఆర్తనాదాలతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి మంగమ్మ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయశ్రీ కోసం గాలిస్తున్నారు.