ఇంకా ఆంధ్రోళ్లేనా.. నవ్వుతారు, అసలు మీరేం చేస్తున్నారు: ఎర్రబెల్లి, కెసిఆర్ అభ్యంతరం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రైతు సమస్యల పైన చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే కానీ, రైతులు మాత్రం పేదవారిగానే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు పదేపదే గత ప్రభుత్వాలను విమర్శించడం విడ్డూరమన్నారు. ఇంకా గత పాలకులను, ఆంధ్రోళ్లు అంటూ తిట్టడం మాని, అసలు మీరేం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రశ్నించే ఎమ్మెల్యేల పైన అధికార పార్టీ దాడులు చేయిస్తోందన్నారు. తమ పైన దాడిని సభాపతికి ఫిర్యాదు చేశామన్నారు.
కరవు మండలాలపై ప్రతిష్టకు పోకండి.. కేంద్రం సాయం చేస్తుంది
కరువు మండలాల పైన ప్రకటన చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టకు పోతోందన్నారు. ప్రభుత్వం చొరవ చూపితే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. పౌల్ట్రీ రైతుల కంటే మామూలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కేంద్రానికి సర్కారు నివేదిక ఎందుకు పంపించడం లేదో చెప్పాలన్నారు.
ఇంకా పాత ప్రభుత్వాలను, ఆంధ్రోళ్లను తిట్టుకుంటూ పోతే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇలా మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. రైతులు మూడుసార్లు విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదన్నారు.
ఖరీఫ్ పంటలు ఎండిపోవడానికి కెసిఆర్ ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే అయినా, రైతులు పేదవారు అన్నారు. మంత్రులు పదేపదే గత ప్రభుత్వాలను విమర్శించడం మానుకోవాలన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలన్నారు. 14వందల రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు.
కరవు కింద మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అరకొరగా వచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధరల లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కరవు మండలాలను ప్రకటించాలన్నారు.
పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గిందన్నారు. రెండేళ్ల నుంచి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని, ప్రజలు మీకు అధికారం ఇస్తే టీఆర్ఎస్ చేసిందేమిటని నిలదీశారు. ఖరీఫ్ ఎండిపోవడానికి టిఆర్ఎస్ కారణమన్నారు.
గత ఏడాది విద్యుత్ కోతల వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యల పైన హేళన చేయవద్దని, రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలన్నారు. సభ ద్వారా రైతులకు ధైర్యం చెబుతామన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారు?
ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలన్నారు. బావుల్లో నీళ్లు ఉన్నప్పుడు ప్రభుత్వం విద్యుత్ ఇవ్వలేదన్నారు. రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేద్దామన్నారు.
కెసిఆర్ అభ్యంతరం..
ఫాం హౌస్ ఉన్ వాళ్లే ధనిక రైతులన్నారు. బ్యాంకర్లు రైతులకు సహకరించడం లేన్నారు. ఓ సమయంలో ఎర్రబెల్లి వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి ఎర్రబెల్లి మాట్లాడుతూ... అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే ఉపసంహరించుకునేందుకు సిద్ధమని చెప్పారు.
రైతులకు మనం భరోసా ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు, ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు.
అప్పు పుట్టేందుకు రైతు మంచిగా ఉంటాడు
తెలంగాణ రైతులు తమకు అప్పు పుట్టేందుకు మంచి ఇల్లు కట్టుకుంటాడని, అవసరమైతే కారు కొనుక్కుంటాడని, అయినంత మాత్రాన వారిని ధనిక రైతులుగా భావించవద్దన్నారు. ఫాం హౌస్ ఉన్నవాళ్లే ధనిక రైతులు అన్నారు. రైతులు లేని సమయంలో మార్కెట్ యార్డుకు వెళ్లి ఏం లాభమన్నారు.