మహిళలను ఎత్తుకెళ్లి దోచుకుంటున్న ముఠా పట్టివేత
హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను వెంబడించి బలవంతంగా ఎత్తుకెళుతూ బెదిరించి దోచుకుంటున్న దోపిడీ ముఠాను ఎట్టకేలకు హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఒకరు 16 ఏళ్ల బాలుడు ఉన్నాడు. రెండేళ్లుగా నగర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠాలోని నల్గురు సభ్యులు గల దొంగలను అరెస్టు చేశారు.
వారి వద్ద బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు మల్కాజిగిరి ఏసిపి రవిచందన్రెడ్డి తెలిపారు. గురువారం స్టేషన్లో ఇన్స్పెక్టర్లు ఎస్.ఖాజామోయినొద్దీన్, నర్సింహారెడ్డి, ఎస్ఐ రవిందర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వివరించారు.
ఉప్పల్ నాగోల్ రోడ్డులోని దేవేందర్నగర్లో నివసిస్తున్న గుండ్లపల్లి శ్రవణ్కుమార్ అలియాస్ నాని (21), కోనేటి మరియాదాసు అలియాస్ ఏసు రత్నం (20), బానోతు వినోద్కుమార్ అలియాస్ కుమార్ (21), మరొకరు 16 ఏళ్ల బాలుడు బొజ్జపోగు ప్రవీణ్ అలియాస్ డేవిడ్ 2013 సంవత్సరంలో సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలో డెకాయిట్ కేసులో నిందితులు. మహిళను కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేసి ఆమె వద్ద ఉన్న ఏటిఎం కార్డుతో బ్యాంక్లో డబ్బులు డ్రాచేయించారు.
ఈ కేసులో మొత్తం ఐదుగురిలో ఇద్దరిని అప్పట్లో అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మిగతా వీరు తప్పించుకు తిరుగుతున్నారు. మెట్రో రైలు డిపో, స్టేషన్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో కాలక్షేపం కోసం వచ్చే భార్యాభర్తలు, మహిళలను బెదిరించి దోపిడీ చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనంలో జనరేటర్ను ఎత్తుకెళ్లారు. అందిన సమాచారం మేరకు తప్పించుకు తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టయింది.
వీరిలో శ్రావణ్, దాస్పై నాలుగు, వినోద్పై ఒకటి, బాలుడు ప్రవీణ్పై రెండు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పై ముగ్గురిని కోర్టుకు రిమాండ్ చేయగా 16 ఏళ్ల బాలుడు ప్రవీణ్ను జువైనల్ హోంకు తరలించినట్లు ఏసిపి రవిచందన్రెడ్డి పేర్కొన్నారు. డెకాయిట్ గ్యాంగ్పై ఫిర్యాదులు ఉంటే నేరుగా స్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.