కులగణన కోసం డెడికేటెడ్ బీసీ కమిషన్: సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణలో బీసీ కుల గణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు.
అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన రేపటి(సోమవారం)లోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అధికారులకు చెప్పారు.
నవంబర్ 6 నుంచి కులగణన
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నారు. తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు.
కాగా, కుల గణనలో.. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? ఈ వివరాలన్నీ సేకరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక్కో కుటుంబంలోని సభ్యుల సమాచార సేకరణకు మొత్తం 60 ప్రశ్నలను తయారు చేశారు. వీటిలో సగం కుటంబం నేపథ్యంపైనే ఉండగా, మిగిలినవి వ్యక్తిగత వివరాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రశ్నల్లో ఏవి అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications