తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా.. కోర్టు నోటీసులు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేశారు బిజెపి నాయకులు. గత మే నెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా తమపైన అబద్దాలు ప్రచారం చేశారంటూ బిజెపి పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది.
రేవంత్ రెడ్డి పై బీజేపీ నేతల ఆరోపణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేలో జరిగిన లోకసభ ఎన్నికల సందర్భంగా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని ఎన్నికల సభలలో ప్రచారం చేశారు. దీనితో ప్రజలలో గందరగోళం నెలకొందని, తమ పార్టీ పైన అపనమ్మకం కలిగిందని రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా
బిజెపి ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంలో నిజం లేదని, ప్రజల్లో పార్టీపై అపనమ్మకం కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, తమ పార్టీ పరువుకు నష్టం కలిగించిన రేవంత్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని ఆయన పరువు నష్టం దావా వేశారు . ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడుప్రచారం చేయటం తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి నోటీసులు
మే 4వ తేదీన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇక బిజెపి వేసిన పరువునష్టం దావా కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది హంస దేవినేని వెల్లడించారు.
పరువు నష్టం దావాపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో
సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పరువు నష్టం దావా వేసినట్టు వివరించారు. మరి బీజేపీ వేసిన పరువు నష్టం దావాపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో.. నోటీసులకు ఏం సమాధానం చెప్తారో తెలంగాణలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications