టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు బీజేపీ-కాంగ్రెస్ చేతులు కలిపాయా?
హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేతులు కలిపాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
బీజేపీ-కాంగ్రెస్ సర్దుబాటు..
ఐటీ హబ్గా వెలుగొందుతున్న మణికొండ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడిన తర్వాత మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి మున్సిపల్ ఛైర్మన్ దక్కకుండా ఈ రెండు పార్టీలు చర్చలు జరిపాయని సమాచారం. కాగా, మణికొండలో మొత్తం 20 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 6, టీఆర్ఎస్ పార్టీకి 5 వార్డుల్లో గెలిచాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
మక్తల్లో... జితేందర్ రెడ్డి..
మక్తల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ.. తన నియోజకవర్గం కిందికే మక్తల్ వస్తుందని తెలిపారు. ఎలాంటి సర్దుబాటు జరగలేదని తెలిపారు. బీజేపీ అత్యధిక వార్డుల్లో గెలిచిందని, మెజార్టీ ఉందని చెప్పారు. ఇక ఇతర ప్రాంతాల్లో స్థానికంగా సర్దుబాటులు జరుగుతూ ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్..
అయితే, స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలాంటి సందర్భాల్లో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని, గతంలో కూడా పలు పార్టీలు ఇలా చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీలా కాంగ్రెస్ పార్టీ పోరాడలేకపోతోందని, ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థులేనని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు సర్దుబాటుకు వెనుకాడే అవకాశం లేదన్నారు. నిజామాబాద్లో బీజేపీ అత్యధిక వార్డుల్లో గెలిచింది.. అక్కడ కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు సర్దుబాటులు జరగవచ్చని అన్నారు. బహిరంగంగా ఈ రెండు పార్టీలో పొత్తు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించవని, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా రహస్యంగా కలిసి పనిచేస్తాయని తెలకపల్లి రవి అన్నారు.
స్థానికం వేరు..
స్థానిక ప్రజల అభీష్టం మేరకే ఈ రెండు పార్టీలు కూడా సర్దుబాటు చేసుకుంటున్నాయని, రాష్ట్ర అధినేతలు ఆసక్తి చూపితే అనుకున్నట్లు జరిగిపోతుందని ఆయా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. స్థానిక నేతలు సర్దుబాటు చేసుకుందామనుకుంటే తాము జోక్యం చేసుకోమని, అయితే, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు మరో బీజేపీ నేత రామచందర్ రావు.
అపవిత్ర కలయికంటూ కేటీఆర్..
కాగా, కాంగ్రెస్, బీజేపీ స్థానిక సంస్థలను దక్కించుకునేందుకు జట్టు కట్టడాన్ని అపవిత్ర కలయిక అంటూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం ఈ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు కూడా వెనుకాడవని, వీరికి ప్రజా సంక్షేమం అవసరం లేదని ఆరోపించారు. 120 మున్సిపాలిటీలకు 112 మున్సిపాలిటీలను, 10 కార్పొరేషన్లను టీఆర్ఎస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.