ఢిల్లీ హింసకు వ్యతిరేకంగా హైదరాబాదులో క్యాండిల్ లైట్ మార్చ్...పోలీసుల తీరు ఖండన
హైదరాబాదు: ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లు ఆ పై హింసను ఖండిస్తూ హైదరాబాదు నగరంలో మంగళవారం రాత్రి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై వ్యవహరించిన తీరును ఖండించారు. టోలీచౌకి, సెవెన్ టూంబ్స్ రోడ్, కింగ్ కోటీ, యాకుత్పురాల్లో క్యాండిల్ లైట్ నిరసనలు జరిగాయి. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కువగా మహిళలే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Video

ఢిల్లీ పోలీసులు అరాచకత్వాన్ని నిరసనల్లో పాల్గొన్న మహిళలు ఖండించారు. అంతేకాదు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీల అమలును కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇదిలా ఉంటే నెక్లెస్రోడ్ మీదుగా హుస్సేన్సాగర్ వైపునకు క్యాండిల్ లైట్ మార్చ్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పాల్గొన్న పలువురు కార్యకర్తలు ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ అదే సమయంలో ఒక వర్గం వారు వ్యవహరించిన తీరును ఖండించారు. ఇక నెక్లెస్ రోడ్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతం మొత్తం రాత్రి 9 గంటలలోపే ఎడారిని తలపించింది.

మరోవైపు హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. అంతా కలిసే సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు. ఢిల్లీ నుంచి వస్తున్న వార్తల ఆధారంగా ఎవరూ ఎలాంటి హింసకు పాల్పడరాదని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరం సర్వ మతాల సమ్మేళనమని అంతా సోదరభావంతో మెలుగుతుండటాన్ని గర్వంగా భావించాలని చెప్పిన అంజనీ కుమార్ ... గాలివార్తలను నమ్మరాదని చెప్పారు. అనునిత్యం పోలీసులు పాట్రోలింగ్ చేస్తుంటారని ఏదైనా అనుమానం వస్తే వారిని కలిసి సమాచారం ఇవ్వాలని నగర ప్రజలను కోరారు.
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు సంబంధించి జాతీయ వీడియో విజువల్స్ను టెలికాస్ట్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు అంజనీ కుమార్. నగరం శాంతియుతంగా ఉండాలని కోరుకునే వారిని ఆ వీడియోలు డిస్ట్రబ్ చేస్తాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు ప్రజలను పరీక్షిస్తున్నాయని వీటిని అధిగమించి శాంతి నెలకొనేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంజనీ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications