టాటూ మోజులో పడి కటకటాలపాలైన యువతి: ఆమె బ్యాంక్ ఖాతాతో ఏపి, టీల్లోనూ మోసాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: టాటూపై మోజు ఓ యువతిని నిందితురాలిగా మార్చింది. దీంతో చేయని నేరానికి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన వినీషా కటారియా పీజీ డిప్లామా ఇన్ మాస్ కమ్యూనికేషన్(పీజీడీఎంసీ) పూర్తి చేసింది. రాజస్థాన్లో నివసిస్తున్న ఆమె.. టాటూ వేయించుకోవడానికి గూగుల్లోని క్లోజ్గురుని సర్చ్ చేసింది. కాగా, అందులో హింకీ హాలిక్స్ పేరు కనిపించింది.
ఈ క్రమంలో ఆ షాపులో టాటూ వేసే యువకుడు నామన్ అరోరా(హ్యారీ)ని కలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఇద్దరం భాగస్వామ్యంతో వ్యాపారం చేద్దామని స్పాంక్ బ్రాండ్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రారంభించి ఆన్లైన్ మార్కెటింగ్ చేశారు. తర్వాత తేడాలు వచ్చి ఆ వ్యాపారాన్ని నిలిపేశారు.
ఇద్దరూ కలిసి వ్యాపారం చేసే సమయంలో వినీషా కటారియా పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండేది. అయితే, ఆమె ఏటిఎం కార్డు నామన్ అరోరా వద్దే ఉండేది. ఇద్దరి మధ్య తేడాలు వచ్చి వ్యాపారంలో విడిపోయినా వినీషా బ్యాంక్ అకౌంట్ని అరోరా ఆపరేట్ చేసేవాడు. ఈ విషయాన్ని వినీషా గమనించలేదు.
నామన్ అరోరా అతని ముఠా సభ్యులు స్టోర్ 1800.కాం పేరుతో మరో వెబ్సైట్ని ప్రారంభించారు. ఇందులో చౌకగా ఎలక్ట్రానిక్ గూడ్స్ లభ్యమవుతాయని నమ్మించారు. డిస్కౌంట్ ధరకు వస్తువులు అందిస్తున్నందుకు ముందుగా సగం ధర చెల్లించమని కొనుగోలుదారులను కోరేవారు. అయితే ఏ ఒక్కరికీ ఈ ముఠా వస్తువులను పంపేది కాదు.
ఇలా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల ప్రజలను ఈ ముఠా మోసం చేసింది. రూ. 1.10 కోట్ల మేర మోసం చేసినట్లు బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందాయి. కాగా, వస్తువుల కొనుగోలుదారులు పంపిన నగదు వినీషా బ్యాంక్ ఖాతాకి చేరేది.
ఆమె ఖాతా నుంచి డబ్బులు తీసుకుని నామన్ అరోరా, అతని సోదరుడు నిఖిల్ అరోరా, తల్లి రవీందర్ కౌర్, స్నేహితురాలు సుజాతా సింగ్ సమానంగా పంచుకునేవారు. ప్రజలను మోసం చేసి కాజేసిన నగదు వినీషా బ్యాంక్ ఖాతాలో జమ అయిన నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం చేయపోయినప్పటికీ ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో ఆమె కేసుకు సంబంధించిన పై విషయాలను వెల్లడించింది.