పే డే, పెయిన్ డే: తెల్లవారుజాము నుంచీ క్యూలు, అర గంటకే నో క్యాష్ బోర్డులు
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగులు కూడా నగదు కోసం తీవ్రమైన కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఖాతాల్లో డబ్బులున్నా తీసుకోలేని పరిస్థితి ఎదరువుతోంది.
హైదరాబాద్: వేతన జీవులు పేడే పెయిన్ డేగా మారింది. తమ జీతాలు ఖాతాల్లో జమ అయినప్పటికీ తీసుకోలేని ఓ విచిత్రమైన పరిస్థితి వారు ఎదుర్కుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా బ్యాంకుల్లో, ఎటిఎం వద్ద క్యూ కట్టారు. గురువారం తెల్లవారు జాము నుంచే బ్యాంకులకూ, ఎటిఎం సెంటర్లకూ చేరుకుని క్యూల్లో నిలుచున్నారు.
నెల ప్రారంభం ఖర్చులను తీర్చుకోలేని స్థితిలో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, అసహనం కూడా వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగర ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.

తగినంత డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితి ఓ వైపు ఉంటే, అందిన 2 వేల నోట్లను వినియోగించుకోలేని పరిస్థితి మరోవైపు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బ్యాంకులు రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు. తెరిచిన అర గంటలోపే బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు నగదు పరిమితి విధించి టోకెన్లు ఇస్తున్నారు.
పరీక్ష ఫీజులు కట్టడానికి విద్యార్థులు, వేతనాలను తీసుకోవడానికి ఉద్యోగులు ఎటిఎంల వద్ద, బ్యాంకుల్లో క్యూ కట్టారు. వారికి తోడు పింఛన్దారులు తోడయ్యారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు వంటి నగర ప్రాంతాల్లో కూడా గత మూడు వారాలుగా చాలా ఎటిఎం కేంద్రాలు మూసే ఉన్నాయి.
ప్రయాణాలు చేయడానికి కూడా డబ్బులు లేని స్థితిని ప్రజలు ఎదుర్కుంటున్నారు. పాలకు, బియ్యానికి, కూరగాయాలకు, పిల్లల ఫీజులకు, ఇంటి అద్దెలకు రెండువేల రూపాయల ఎలా సరిపోతాయని ప్రజలు అడుగుతున్నారు. దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత ఉండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
కొంత మంది ఉద్యోగులకు సంస్థలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి పాత ఐదు వందల నోట్లు వేతనాలుగా ఇస్తున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. దీంతో వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేది ఎప్పుడు, తీసుకునేది ఎప్పుడు అనే ఆందోళన సర్వత్రా అలుముకుంది.












Click it and Unblock the Notifications