నోట్లో మన్నుపోస్తూ..: ఏపీ ఉద్యోగులపై దేశపతి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారవంతమైన భూములను అక్కడి ప్రజలు అమరావతి కోసం త్యాగం చేస్తే ఉద్యోగులు వారి నోట్లో మన్నుపోస్తూ తెలంగాణలో ఉండటం ఏమిటని తెలంగాణ సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సోమవారం నాడు ప్రశ్నించారు.
మీరు ఇక్కడ అక్రమ ఉద్యోగులు అని, న్యాయవిరుద్ధంగా ఉద్యోగంలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యుత్తు శాఖలోని ఏపీ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యుత్తు శాఖలో ఏపీకి రిలీవ్ అయిన 1200 మంది ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లాల్సిందేనని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు పంపించాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆందోళన చేస్తోంది. ఆందోళనలో భాగంగా సోమవారం విద్యుత్ సౌధలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేశపతి శ్రీనివాస్ పై వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమలనాథన్ కమిటీ నిబంధనలు విద్యుత్ సంస్థల్లాంటి కార్పోరేషన్లకు వర్తించవని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అభిప్రాయపడింది. విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం కార్పోరేషన్ల ఉద్యోగుల విభజన సమస్యలపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీకి జేఏసీ సమన్వయకర్త రఘు సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
ఏం చేస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకారిగా ఉంటుందో అందులో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనను సెక్షన్ 77 ప్రకారం చేపట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్ల ఉద్యోగుల విభజనను సెక్షన్ 82 ప్రకారం చేయాలని చట్టంలో ఉందని తెలిపారు. ఏపీ సంస్థలు కావాలనే సెక్షన్ 77 ప్రకారం విభజించాలని తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు.