Basara: బాసర సరస్వతి క్షేత్రానికి భారీగా తరలొచ్చిన భక్తులు
వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి ఆలయానికి భక్తులు భారీగా తరలొచ్చారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రానికి భారీగా భక్తులు తరలొచ్చారు. గురువారం వసంత పంచమి కావడంతో పిల్లలకు 'అక్షరాభ్యాసం' చేయించాడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హిందూ సంప్రదాయాల్లో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ హిందూ సంప్రదాయంలో భాగం.

తెల్లవారుజామున 2
పవిత్రమైన రోజున తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి భక్తులు భారీగా వేచిఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.

విద్యుత్ దీపాలతో
వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయాన్ని విద్యుత్దీపాలతో సుందరీకరించారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయం మిరుమిట్లు గొలుపుతున్నది. పలువురు భక్తులు ముం దుగానే చేరుకొని ఆలయ ఆవరణలోనే నిద్రించారు. ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

300 మంది పోలీసులు
అక్షరాభ్యాసం కోసం అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications