రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం; అవన్నీ తప్పుడు ఆరోపణలు: డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఆయన రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
భుజానికి ఫ్రాక్చర్ కావటం వల్లే సెలవులో ఉన్నా: డీజీపీ మహేందర్ రెడ్డి
ఇంట్లో తాను కాలు జారి పడ్డానని దాంతో తన ఎడమ భుజం పైన ఎముకకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ల లో ఈ విషయం తేలడంతో తాను చికిత్స తీసుకుంటున్నానని, భుజం కదలకుండా కట్టు కట్టారని మహేందర్ రెడ్డి వెల్లడించారు. అందువల్లనే తాను ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు విధులలో చేరుతానని ఆయన వెల్లడించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా రేవంత్ వ్యాఖ్యలు సమంజసం కాదు
ప్రస్తుతం భుజానికి అవసరమైనవ్యాయామం, ఫిజియోథెరపీ చేయించడం జరుగుతుందని పేర్కొన్న ఆయన, వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. విరిగిపోయిన ఎముక తిరిగి అతుక్కోవడం కోసం పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతోనే తాను సెలవు పెట్టానని పేర్కొన్న డిజిపి మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి బాధ్యతారహితమైన ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చెయ్యటం భావ్యం కాదు
ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారాలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీయడం తోపాటు రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
సీనియర్ అధికారులపై వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం, విచక్షణ అవసరం
బాధ్యతాయుతమైన సీనియర్ పబ్లిక్ సర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణను, సంయమనాన్ని పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీనియర్ అధికారి పై ఈ విధమైన ఆరోపణలు చేయడం ఆక్షేపణీయం అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం పై అపోహలు పెరిగే అవకాశం ఉందన్నారు. సీనియర్ అధికారులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనాన్ని, విచక్షణను పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి హితవు పలికారు.