చంద్రబాబు దొరికారు, కెసిఆర్ దొరకలేదు: అంతేనన్న డిగ్గీ రాజా
న్యూఢిల్లీ/ హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం దొరకలేదని, ఇద్దరిలో తేడా ఏమీ లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబా, కాదా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోటుకు ఓటుకు కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) వేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నుచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించిన వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు.
రాష్ట్ర ఖజానాకు గండి కొట్టే విధంగా టెండర్లు లేకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇన్నోవాలు, మోటార్ వాహనాలు, ట్రంక్ పెట్టెలు కొనుగోలు చేయడంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా సాగుతున్న కెసిఆర్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని విక్రమార్క మంగళవారం మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications