రామోజీరావుతో దిగ్విజయ్ సింగ్ భేటీ, మా వార్తలు రాయాలని విజ్ఞప్తి!
హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మంగళవారం నాడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
చాలా రోజుల అనంతరం మర్యాదపూర్వకంగానే తాను రామోజీ రావును కలిసినట్టు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ముఖ్యమైన అంశాలపై ఎటువంటి చర్చలూ జరగలేదన్నారు.
ఇటీవలి కాలంలో రామోజీరావును పలువురు రాజకీయ ప్రముఖులు కలుస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావును కలిశారు.

ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కలిశారు. రామోజీ రావుతో పాటు పలువురు మీడియా ప్రతినిధులను దిగ్విజయ్ సింగ్ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిగ్గీ వారిని కోరారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల వార్తలకు సరైన కవరేజీ ఇవ్వాలని మీడియా సంస్థల అధినేతలను దిగ్విజయ్ సింగ్ కోరారని తెలుస్తోంది.
కెసిఆర్ పైన పొన్నాల నిప్పులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బుధవారం మండిపడ్డారు. కెసిఆర్ రైతు ఆత్మహత్యలను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతికి వెళ్తున్న కెసిఆర్ రైతుల పట్ల మాత్రం అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications