ఆ కేసు కొట్టేయండి! హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని పిటిషన్లో కోరారు. ఇక, ఆ కేసు విషయానికొస్తే.. గత సంవత్సరం ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు.
బీజీపీకి పరువు నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. కాసం వెంకటేశ్వర్లు పిటిషిన్ను విచారణకు స్వీకరించిన ప్రజా ప్రతినిధుల కోర్టు.. సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని కాసం తన పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్పై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్ లను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అంతేగాక, కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. తాజాగా రేవంత్ వేసిన పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా పలు పరిశ్రమలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వేల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. పలు సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.












Click it and Unblock the Notifications