కేటీఆర్ మీరెంత.. మీ బ్రతుకెంత; నీ అయ్యకు దమ్ముంటే.. కేటీఆర్ పై డీకేఅరుణ ఘాటువ్యాఖ్యలు!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన పై, తుక్కుగూడలో నిర్వహించిన సభపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు అంటూ అమిత్ షా టూర్ పై సెటైర్లు వేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రాన్ని దోచుకుతింటుంది మీరే కేటీఆర్
కేటీఆర్ మీరెంత.. మీ బ్రతుకెంత అంటూ విరుచుకుపడిన డీకే అరుణ మీ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రాజెక్టుల పేరుతో అప్పులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఎందుకు 299 టీఎంసీల నీటిని తీసుకున్నారని డీకే అరుణ ప్రశ్నించారు.
2014 నుండి 2022 వరకు ఈ రాష్ట్రప్రభుత్వం 69 వేల కోట్ల పెట్రోల్, డీజిల్ రూపంలో టాక్స్ వసూలు చేసిందని, దేశంలో మరెక్కడా లేని విధంగా టాక్స్ లు వసూలు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
సంక్షేమ పథకాల నిధులు మీ ఇళ్లలో నుంచి ఇస్తున్నారా?
కేటీఆర్ నీ అయ్యకు దమ్ముంటే నిన్ను ముఖ్యమంత్రిని చేయమను అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో మీరు ఉండరు అంటూ తేల్చి చెప్పారు. మీకు దమ్ముంటే పోలీసులు లేకుండా ఊర్లలో తిరగమని డీకే అరుణ చాలెంజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి పింఛన్ ఇవ్వడంలేదని డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో జనాలకు ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు మీ ఇళ్లలో నుంచి ఇస్తున్నారా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు.
కేటీఆర్... నీకా స్థాయి లేదు
తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని డీకే అరుణ నిప్పులు చెరిగారు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన విడుదల కంటే ఎక్కువ ఇచ్చిందని పేర్కొన్న డీకే అరుణ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకొని మాట్లాడాలంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
తుక్కుగూడలో అమిత్ షా మాట్లాడింది వందకు వంద శాతం వాస్తవం అని పేర్కొన్న ఆమె ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఇదేనా మీ టిఆర్ఎస్ సంస్కృతి అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ గురించి అమిత్ షా గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని డీకే అరుణ తేల్చిచెప్పారు.
మీ మీద నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్
కెసిఆర్, కేటీఆర్ భాష తీరు మార్చుకోవాలని హితవు పలికిన డీకే అరుణ కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు. తండ్రీకొడుకులు భవిష్యత్ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. మీ మీద మీకు నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని, ఫామ్ హౌస్ కు నీళ్లు తరలింపు కోసం ప్రాజెక్టుల పేరుతో కోట్లు అప్పు చేశారని డీకే అరుణ విమర్శించారు.