కేసీఆర్ బండారం బయటపెడతామనే.. బీజేపీ అంటే వణుకు: డీకే అరుణ
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజునే బిజెపి ఎమ్మెల్యేలైన రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి ఎమ్మెల్యేలు న్యాయ పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాల సమయం మొత్తం బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితి చోటు చేసుకుంది. కోర్టు సూచనలతో బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తమను అనుమతించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మరోమారు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన నిరాకరించడం బిజెపి ఆగ్రహానికి కారణమైంది.

ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా సభలో ఉన్నవారంతా టీఆర్ఎస్ వాళ్ళే
తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు మినహా మిగతా ఉన్న వాళ్లంతా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. సభలో కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ వారిని కూడా గులాబీ నేతల ఖాతాలోనే వేశారు డీకే అరుణ. ఇక ఇదే సంశయంలో కెసిఆర్ కు బీజేపీని చూస్తే వణుకు పుడుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈటల కేసీఆర్ బండారం బయటపెడతారనే సస్పెన్షన్
కెసిఆర్ కు కలలో కూడా బిజెపి నేతలు కనిపిస్తున్నారు అంటూ డీకే అరుణ పేర్కొన్నారు. కెసిఆర్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని కోల్పోయారని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడానికి కెసిఆర్ బడ్జెట్ పెట్టారన్నారు. కెసిఆర్ అంకెల గారడీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని డి.కె.అరుణ విమర్శించారు. ఈటల రాజేందర్ కేసీఆర్ బండారం బయటపెడతారని ఆయన భయపడ్డారు అని ఎద్దేవా చేశారు. అందుకే బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేశారని డీకే అరుణ విమర్శించారు.

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో కేసీఆర్ కు మాట పడిపోయింది
ఏ పథకమైనా సరే అందులో అవినీతిని బయట పెడతామంటే భయపడి అసెంబ్లీ నుంచి పంపించి వేస్తున్నారు అంటూ డీకే అరుణ పేర్కొన్నారు. బిజెపి నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో కెసిఆర్ కి నోటిమాట పడిపోయిందని డీకే అరుణ వెల్లడించారు. అంతకు ముందు వరకూ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పెడతానని, అన్ని రాష్ట్రాలు తిరుగుతానని నోటికొచ్చినట్టు మాట్లాడిన కెసిఆర్, ఇటీవల వచ్చిన ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత భయపడి సైలెంట్ అయ్యారు అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.
Recommended Video


తెలంగాణా సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం అన్నా గౌరవం లేదు
ఇప్పుడు మళ్ళీ జాతీయ రాజకీయాల ఊసు ఎత్తటం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఆమె మండిపడ్డారు. కనీసం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగాన్ని కూడా పెట్టకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని డీకే అరుణ విమర్శించారు. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇవ్వటం ఖాయమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications