ఆంధ్రలో చదివి, ఆ పేరు పెట్టుకోలేదు: కేటీఆర్కు అరుణ
మహబూబ్ నగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలు డీకే అరుణ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కేటీఆర్లో ఆంధ్రాలో చదువుకొని, ఎన్టీఆర్ పేరు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారని, ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. తాను వందకు రెండు వందల శాతం తెలంగాణ బిడ్డను అన్నారు. కేటీఆర్లో గుంటూరులో చదివి, ఆంధ్రా పార్టీ వారి పేరు పెట్టుకోలేదన్నారు.

చేతులు దులుపుకోవడం కాదు: షబ్బీర్ అలీ
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు అందరి పైన కేసులు ఎత్తి వేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. చిన్న చిన్న కేసులు ఎత్తివేసి చేతులు దులుపుకోవడం కాదని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమంలో పాల్గొన్న వారు ఎందరో కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్నారు. సాయం అందని కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయన్నారు.
ప్రభుత్వంపై పొన్నాల
తెలంగాణలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యుత్ సమస్యలకు కేసీఆర్ అనుభవ లేమి, అసమర్థతే కారణమని మండిపడ్డారు.
బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి కేసీఆర్ బాధ తెలంగాణ తెస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్కు కాలం దగ్గర పడిందని, ఇక ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పొన్నాల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన విషయం తెలిసిందే.
రైతు ఆత్మహత్యలపై గవర్నర్కు జగన్ పార్టీ ఎంపీ
రైతు ఆత్మహత్యల పైన ఖమ్మం పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ నరసింహన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం పొంగులేటి మాట్లాడారు. రుణమాఫీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు.
తెలంగాణలో రైతులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని, వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోజుకు తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల వేళ హమీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కనీసం మూడు గంటల పాటు ఇవ్వకపోవడం ద్రోహం చేయడమే అని మండిపడ్డారు. ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో కార్యాచరణను రూపొందిస్తామని ఎంపీ పొంగులేటి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications