కవితకు బీజేపీ ఆహ్వానం కేసీఆర్ చిల్లరరాజకీయం; టీఆర్ఎస్పై బీజేపీ యుద్ధం కొనసాగుతుంది: డీకే అరుణ
తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని చెప్పిన ఆయన, బిజెపి నేతలు కవితను బిజెపిలో చేరమని అడిగినట్లుగా వెల్లడించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని పేర్కొన్న సీఎం కేసీఆర్, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బిజెపి రెచ్చిపోతుంది అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పది నెలలు పార్టీని బలోపేతం చేయడంపై అందరూ కష్టపడాలని సూచించిన కెసిఆర్, ఎటువంటి వివాదాలలో తలదూర్చకుండా కష్టపడి పని చేయాలని హుకుం జారీ చేశారు.
కేసీఆర్ కూతుర్ని బీజేపీలోకి ఆహ్వానించలేదు : డీకే అరుణ
కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో మండిపడ్డారు. బిజెపి ఎప్పుడో టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిందని పేర్కొన్న డీకే అరుణ, కెసిఆర్ బీజేపీతో చేయాలనుకుంటున్న యుద్ధానికి తామంతా రెడీగా ఉన్నామని వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి కూతురిని బీజేపీలోకి ఆహ్వానించామని కెసిఆర్ చెప్పడం చిల్లర రాజకీయానికి నిదర్శనం అని డీకే అరుణ మండిపడ్డారు. ఎవరూ కేసీఆర్ కూతురిని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించరని, అవినీతి పరులైన కెసిఆర్ కుటుంబం నుండి ఎవర్నీ బిజెపిలో చేర్చుకునే ఆలోచన ఎవ్వరికీ లేదు, రాదు అని డీకే అరుణ తేల్చిచెప్పారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ రెడీ
కవితను బీజేపీలో చేర్చుకోవడానికి ఆహ్వానించామని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఆయన మోసం చేసుకోవడమేనని డీకే అరుణ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రెండుసార్లు గెలిపిస్తే పదేపదే మోసం చేసి, ఇప్పుడు మూడోసారి కూడా మోసం చేయడానికి రెడీ అవుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
స్వతంత్ర దర్యాప్తు సంస్థలపై దాడులు చెయ్యమని చెప్పటం ప్రజాస్వామ్య హత్యతో సమానం
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వతంత్ర దర్యాప్తు సంస్థలపై ఎదురు దాడి చేయమని కెసిఆర్ పిలుపునియ్యడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంతో సమానం అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్హౌస్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకు వస్తే ఎక్కడ బండారం బయటపడుతుందో అన్న భయంతో ముఖ్యమంత్రి తన వద్దనే నలుగురు ఎమ్మెల్యేలను పెట్టుకున్నారని డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి బిజెపి సిద్ధంగా ఉందన్న డీకే అరుణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.