కెసిఆర్! మారువేషంలో వెళ్లి చూడు!: అరుణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మహబూబ్నగర్ జిల్లా గద్వాల కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె ఆరుణ విరుచుకుపడ్డారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు
తెలంగాణ ప్రజలు ఎంతగా విసిగిపోయారో తెలియాలంటే మారు వేషంలో వారి మధ్యకు వెళ్లాలని ఆమె కెసిఆర్కు సూచించారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణాలు చూసి దేశం నవ్వుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కెసిఆర్ విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్నారని అరుణ విమర్శించారు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చుకోవడం లేదని ఆమె అన్నారు
ఇతర పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఎంత ఉందో తెలుస్తుందని ఆమె అన్నారు. మిషన్ కాకతీయ నీరుగారి పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.