హరీశ్! ఎక్కడున్నావ్: డీకే అరుణ, సవాల్ విసిరిన సంపత్, పైసా ఇవ్వలేదన్న ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము ఆర్డీఎస్ కోసం స్లూయిస్ను మూయించటానికి పోరాడామని, అప్పుడు హరీష్రావు ఎక్కడ ఉన్నారని ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశామని డీకే అరుణ తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు.

పైసా ఇవ్వలేదని ఉత్తమ్
ఆర్డీఎస్కు టీఆర్ఎస్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదని, తెలంగాణా ప్రజల భవిష్యత్ను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఎస్ పనులు పూర్తి చేయాలని కర్ణాటక సీఎంను కోరామని తెలిపారు.
ఆనకట్టను పటిష్టం చేస్తామని కర్నాటక సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. పనులు పూర్తయితే 83 వేల ఎకరాలకు నీరు అందుతుందని, తుమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడిని వ్యతిరేకిస్తున్నామే తప్ప ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా, ఆర్డీఎస్పై బహిరంగ చర్చకు సిద్ధంమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంత్రి హరీష్రావుకు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్డీఎస్ను ఓట్ల కోసం వాడుకున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్న దీక్షలను దొంగ దీక్ష, కొంగ దీక్ష అంటూ అవహేళన చేయటం దారుణమని సంపత్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications