పరస్పరం తన్నుకుంటూ రైతున్న కంట కన్నీళ్లు తెప్పిస్తారా.?ఇది దేశానికే అరిష్టమన్న టీ టీడిపి.!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్రం ధాన్యం కొనడం లేదని చెప్పే బదులు ఢిల్లీ వెళ్లి ఎందుకు నిలదీయలేక పోతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అధికార పార్టీ నేతలే ధర్నాలు, దీక్షలు చేస్తుంటే రైతన్న గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రం ప్రభుత్వంతో సమస్య పరిష్కారం చేయించే సామర్థ్యం లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకొని ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచుదామని సూచించారు. ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రికి ఎంత బాద్యత ఉందో, ప్రతిపక్ష పార్టీలుగా రైతుల పైన తమకూ అంతే బాద్యత ఉందని ప్రసూన పేర్కొన్నారు.
అన్నం పెట్టడమే అన్నదాత తప్పా.. ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడాలన్న టీ టీడిపి
తెలంగాణ జిల్లాలో రైతులు నడిరోడ్డు పైన ఆరబెట్టినా ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, నోటికాడి బుక్క నేలపాలైనట్టు నాలుగు రోజులైతే తరలించాల్సిన ధాన్యం కళ్లముందే వరదలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. బస్తాల్లో నింపిన ధాన్యం నుంచి నీళ్లు కారుతున్న దృశ్యాలు మనసుని కలిచి వేసిందని ఆందోళన వ్యక్తం చేసారు కాట్రగడ్డ ప్రసూన. ఇక ఆరబోసిన ధాన్యమైతే నీళ్లతో నిండిపోయి రైతులకు కన్నీళ్లు తెప్పించిందని, తడిసిన ధాన్యం ఎలా ఆరబెట్టాలో, ఇప్పటికే కాంటా పూర్తయి తడిసిపోయిన ధాన్యం బస్తాలను ఏం చేయాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో అన్నదాత కుమిలిపోతున్నా తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల్లో లెక్కలేని ఖర్చు చేస్తారు.. రైతన్న పండించిన పంట కొనలేరా?
ఎన్నికల్లో కోట్లకు కోట్ల డబ్బు వెదజల్లి రాజకీయాలు చేసిన గులాబీ పార్టీ, బీజేపీ పార్టీలు కనీసం రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్ద అవుతుంటే కాపాడుకునేందుకు కూడా బాధ్యత తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుందని, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ, ధాన్యం కొనకుండా రైతున్నని మోసం చేస్తున్నారని తీవ్రంగా స్పందించారు. అంతే కాకుండా అకాల వర్షానికి అన్నదాతలు అల్లకల్లోలమయ్యారని, ఒక్క ప్రజాప్రతినిధి కూడా వారి వంక కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీక్షలతో ఉపయోగం ఏంటి.? కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ కు టీ టీడిపి సలహా
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంట దిగుబడి పెరిగిందని సంతోషపడేలోపే తమ ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడని రైతులు కన్నీటి పర్యంతమతున్నారని, ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు త్వరగా స్పందించి కొనుగోలు త్వరితగతిన చేస్తే తప్ప రైతు కి న్యాయం జరగదని టీ టీడిపి సూచిస్తోంది. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని రైతులు తరపున వేడుకుంటున్నట్ల తెలిపారు. వర్షసూచనతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న రైతులకి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే ధాన్యం త్వరగా మిల్లులకు తరలేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీటీడిపి డిమాండ్ చేస్తోంది.
ఉమ్మడి కార్యచరణ అవసరం.. కేసీఆర్ ప్రతిపక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలన్న కాట్రగడ్డ ప్రసూన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి ఇప్పుడు ధాన్యం కొనలేక పోతే యుద్ధ ప్రాతిపదికన రైతులు పండించిన పంటలకు కనీసం సరైన ధరలు వచ్చే వరకు కాపాడుకునేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్టంలో గిడ్డంగులు పెంచాలని, ప్రతి గ్రామంలో గిడ్డంగి ఏర్పాటు చేయాలని, ధాన్యం పైన కప్పేందుకు సరైన క్వాలిటీ పట్టాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రసూన గుర్తు చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన సహాచరులతో ఇందిరా పార్కు దగ్గర ధర్నాకి ఉపక్రమిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలను కూడా భాగస్వామ్యం చేసి రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని ప్రసూన సలహా ఇచ్చారు.