సభలో బాబు కంటతడి: మహేష్ కత్తి దిమ్మతిరిగే కౌంటర్, ప్యాకేజీకి లొంగలేదని కేటీఆర్
Recommended Video

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టారన్న వార్తలపై మహేష్ కత్తి సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజధాని నిర్మాణంపై భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే.
అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని ప్రధాని మోడీ చెప్పారని, కానీ ఇప్పుడు బీజేపీ నేతలు రాజధాని అంటే డ్రీమ్ సిటీ అని హేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అన్నారు.
చంద్రబాబు కన్నీళ్లపర్యంతం
దీనిపై మహేష్ కత్తి సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. 'అమరావతి అనే ఒక మహత్తరమైన కల గురించి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో చెబుతూ కన్నీళ్లపర్యంతం అయ్యారు. బాధ కలిగింది.' అని పేర్కొన్నారు.

బాహుబలి సెట్ చేసింది మీరు
మహేష్ కత్తి ఇంకా 'అయ్యా చంద్రబాబు గారు ! అమరావతిని భ్రమరావతి చేసింది మీరు. దాదాపు ముఫై నగరాల మోడల్స్ చూపించి సింగావతి అనిపించింది మీరు. దాన్నొక బాహుబలి సెట్ స్థాయికి దిగజార్చింది మీరు.' అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్పై ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా మహేష్ కత్తి ఓ ట్వీట్ చేశారు. 'ఇరవైరెండు సంవత్సరాలున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఏమీ చెయ్యని పవన్ కళ్యాణ్, ప్రపంచాన్ని కాపాడటానికి బయల్దేరాడు. ఆ మాట అంటే, ఒక అమ్మాయి మీద అభిమానులు దాడులు చేస్తారు. అది జనసేనాని పంథా, జనసైనికుల పద్దతి. షేమ్! షేమ్!!' అని ట్వీట్ చేశారు.
జైట్లీ సెంటిమెంట్ వ్యాఖ్య, బాబుకు కేటీఆర్
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సెంటిమెంటుకు డబ్బులు రావని చెబుతున్నారని, సెంటిమెంట్ కారణంగానే తెలంగాణ ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఎంతో పోరాటంతో, త్యాగాలతో సాధించుకున్నదని, ప్యాకేజీలకు, ప్రలోభాలకు వెనుకడుగు వేయలేదని, అలాగే ఏపీ హక్కుల కోసం పోరాడాలని, కానీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాన్ని తక్కువ చేయవద్దని ట్వీట్ చేశారు.

రోడ్లపై బీజేపీకి చంద్రబాబు కౌంటర్
ఇదిలా ఉండగా, ఏపీలోని రోడ్లపై బీజేపీ నేతలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రోడ్లకు కేంద్రం బాగా నిధులు ఇచ్చిందని బీజేపీ చెబుతోందని, అది వాళ్ల డబ్బు కాదన్నారు. ప్రజాధనాన్ని వాళ్లు ఇచ్చినట్లు చెప్పుకోవడం ఏమిటన్నారు. పబ్లిక్ ప్రయివేటు సెక్టారులో రోడ్లు వచ్చాయని, రేపటి రోజున రోడ్లు వేసిన వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications