ఏపి ప్రజల మనోభావాలను కించపరచొద్దు.!కేటీఆర్ కు డీకే అరుణ సూచన.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం నగరంలో జరగిన క్రెడాయ్ సమావేశంలో మంత్రి తారక రామారావు మాట్లాడుతూ, ఆంధ్రాలో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రి తారాక రామారావుపై నిప్పులు చెరిగారు.
తారక రామారావుకు తన మిత్రుడు ఎవరో చెప్తే, తాను స్వయంగా అతడిని గద్వాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తీసుకొని వెళ్ళి, అక్కడ రోడ్లు, నీటి, విద్యుత్ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానని, కేటీఅర్ స్నేహితుడు కేవలం కల్వంకుంట్ల వారి ఫార్మ్ హౌస్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసి , మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా ఉంటుందన్న బ్రమలో ఉన్నటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు.
దానికి తోడు కేటీఅర్ సొంత డబ్బా కొట్టుకోవడంలో సిద్ధ హస్తుడన్న విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్న విషయం కేటీఅర్ మర్చిపోయినట్టు ఉన్నారని డీకే అరుణ చురకలు అంటించారు. రెండు ప్రాంతాల ప్రజలు సోదర భావంతో ఐకమత్యంగా మెలుగుతున్నారని, అభివృద్ది, ప్రకృతి వనరులు, మౌళిక సదుపాయాల అంశంలో ఏపి ప్రజల మనోభావాలను కించరచొద్దని డీకె అరుణ సూచించారు.