పాతబస్తీలో దారుణం: ఆస్పత్రిలో సిబ్బంది డీజేడ్యాన్సుల హంగామా; నవజాత శిశువు మృతి; కేసు నమోదు
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులు దైవంతో సమానం అని చెబుతున్నా, కొందరు వైద్యులు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ వ్యక్తిగత సరదాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అనేకమంది జీవితాలలో కొందరు వైద్యులు చీకట్లను మిగులుస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో అటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. చాదర్ ఘాట్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం వల్ల ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన, బాధిత కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. అసలు ఇంతకీ సిబ్బంది ఏం చేశారంటే..
చాదర్ ఘాట్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండడంతో సిబ్బంది సెలబ్రేషన్స్ చేసుకున్నారు. డాన్సులలో మునిగితేలారు. బాణాసంచా కాల్చి హంగామా చేశారు. గానా భజనలతో హోరెత్తించారు. ఆసుపత్రి బిల్డింగ్ పై పార్టీ చేసుకున్న సిబ్బంది, డీజే డాన్స్ లతో వేడుకల్లో మునిగిపోయారు. అయితే అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగుల గురించి సిబ్బంది పట్టించుకోలేదు.
సిబ్బంది గానాభజానాలలో మునిగితేలుతోన్న సమయంలో ఓ గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినప్పటికీ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో మునిగి పోయిన వారు ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలో అ మహిళకు పుట్టిన నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు బంధువులు శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరుపుతామని చెప్పి వారి ఆందోళన విరమింపజేశారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సదరు ఆసుపత్రి పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.