డాక్టర్లు దేవుళ్ళు కాదు,వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది.!అర్ధం చేసుకోవాలన్న ప్రభుత్వ వైద్యుల సంఘం.!
హైదరాబాద్ : తెలంగాణలోని వైద్యులపై పత్రికలలో వివిధ రకాల వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయని, ఒకవేళ ఆ వార్తలు నిజమైతే వాటిని ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. సోమవారం కొన్ని పత్రికలలో వైద్యులకు జియో ట్యాగింగ్ పెట్టనున్నట్లు, జిపిఎస్ మిషిన్లు అమర్చనున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్త చూసి షాక్ కు గురైనట్టు వారు తెలిపారు.

డాక్టర్లు ఎవరూ భగవంతుళ్ళు కాదు..
వైద్యులు జంతువులు కాదని, వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని, అటువంటి ఈ వృత్తిలో ఒకరో ఇద్దరో పొరపాట్లు చేస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, అన్ని శాఖలలో అలాంటివారు ఉంటారని అంతే కానీ వైద్యులందరినీ ఒకే గాడిన కట్టడం సబబు కాదని పేర్కొన్నారు వారు స్పష్టం చేసారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య పథకాలు వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అంటే అది వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే వాటిని అమలు చేసే ప్రతి ఒక్కరి కృషి అని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.

రాష్ట్రాన్ని ఆరోగ్యపదంలో నిలబెట్టడానికే ప్రయత్నాలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రతి సూచనను, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దార్శనికతను, విజన్ ను ప్రతి ఒక్క వైద్యుడు మరియు ఆరోగ్య సిబ్బంది అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యపదంలో నిలబెట్టడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో కొత్త కొత్త పథకాలు రావడం వల్ల తీవ్ర పనిభారం పెరిగిపోయిందని అంతే కాకుండా కరోనాతో మరింత భారం పెరిగినా సరే వైద్యులు మరియు వైద్య ఆరోగ్యశాఖ అలుపెరుగకుండా చేసిన సేవలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు.

వైద్య వృత్తి కట్టడికి ప్రయత్నాలు వద్దు..
పవిత్రమైన వైద్య వృత్తి కట్టడికి ప్రయత్నాలు చేయడం సరికాదని, వైద్యుల సేవలు ఎక్కడైనా రోగికి అందేలా చూడాలని అన్నారు. 24 గంటల వైద్య సేవల కోసం మూడు షిఫ్టుల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. డి.హెచ్ పరిధిలోని వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు వాహన సౌకర్యం లేదని వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, వైద్యం చేసే వారికే హెల్త్ కార్డులు లేకపోవడం దారుణమని అన్నారు. వెంటనే వైద్యులకు మరియు ఆరోగ్య సిబ్బందికి హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విజ్ఞప్తి చేసారు.

కరోనా లో అలుపెరగని సేవ..
కరోనా కట్టడికి మొదటి డోసు, రెండవ డోసు, మూడో డోసు, అంటూ నిరంతరం ఎంతో పని ఒత్తిడికి లోనై సరిపోను సిబ్బంది లేక నానా కష్టాలు పడుతుంటే మూలిగే నక్క పై తాటిపండు చందంలా ఆరోగ్య రంగంపై ఎంతోమంది అవాకులు చవాకులు పేల్చడం సరికాదని డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ దీన్ దయాల్, డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు.
డాక్టర్లు ఎవరూ భగవంతుళ్ళు కాదని అక్కడక్కడ ఏవైనా పొరపాట్లు జరిగితే డాక్టర్లను బలి పశువులను చేయడం సరికాదని అన్నారు. కొన్నిచోట్ల డాక్టర్లను సస్పెండ్ చేయడం, ఆరోగ్య సిబ్బందికి మెమోలు జారీ చేయడం లాంటి సంఘటనలు చూస్తున్నామని అనవసరంగా వైద్యులపై అధిక ఒత్తిడి తీసుకురావద్దని ఈ సందర్భంగా వారు కోరారు.












Click it and Unblock the Notifications