చిక్కుల్లో కేటీఆర్: ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామరావు వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలోని డాక్టర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో చేసిన కామెంట్స్ వైద్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ విషయమై వారం క్రితం తెలంగాణ హెల్త్ కేర్ రిఫార్స్మ్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ఎన్నికల సంఘంను కలిసి వినతిపత్రం అందించారు.
మగవాళ్లు మాత్రమే వస్తారా?, ఆశ్చర్యం వేసింది: సొంత పార్టీకి విజయశాంతి షాక్
కేటీఆర్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసింది. తాజాగా కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు కూడా రంగంలోకి దిగారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఒకరోజు విధులు బహిష్కరించారు.
జూనియర్ డాక్టర్ల ఆందోళన
జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించకుంటే తాము కోర్టుకు వెళ్తామని డాక్టర్లు చెబుతున్నారు. కేటీఆర్ వివాదంలో చిక్కుకోవడంతో అసలేం జరిగిందనే చర్చ సాగుతోంది.
కేటీఆర్ ఏమన్నారంటే
కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో ఆర్ఎంపీ, పీఎంపీల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆర్ఎంపీలు, పీఎంపీలకు సర్టిఫికేట్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. వారికి ప్రిస్కిప్షన్ రాయడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఇందుకోసం జీవో 428లో సవరణలు చేస్తామని తెలిపారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదే సందర్భంగా ఓట్ల పరంగా వివాదాస్పదం అయ్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్క ఆర్ఎంపీ, పీఎంపీలు 500 మందితో టచ్లో ఉంటారని, వారందరితో తెరాస పార్టీకి ఓట్లు వేయించాలని కేటీఆర్ చెప్పారు. ఇలా వారిని ప్రలోభాలకు గురిచేసేలా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైద్యులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
డాక్టర్ల ఆందోళన
కేటీఆర్ చేసిన కామెంట్లపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. తక్షణమే కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని, జీవో 428 సవరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలన్నారు.